Prashant Kishor.. ఇక వాటన్నింటికీ దూరం: ఆ పుకార్లకు చెక్
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న ప్రతీసారీ విస్తృతంగా వినిపించే పేరు.. ప్రశాంత్ కిషోర్. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పని చేసిన తరువాత.. ఈ పేరుకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. ఇక ప్రశాంత్ కిషోర్ తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా ఎదిగారు.

బీజేపీకి వ్యతిరేకంగా..
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ.. కనీసం రెండంకెల సీట్ల సంఖ్యను దాటబోదంటూ ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనాలు ఏ మాత్రం తప్పలేదు.. తప్పు కాలేదు. ఆ తరువాత ఆయన మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పని చేస్తారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. చివరికి- ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

కాంగ్రెస్లో చేరతారనే వార్తలపై
అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ప్రశాంత్ కిషోర్కు కీలక హోదా దక్కుతుందని భావించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరుతారనీ భావించారు. పైగా- వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి కీలక, అతి పెద్ద రాష్ట్రాలు ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. బీజేపీని ఓడించడానికి ప్రశాంత్ కిషోర్.. ఇక తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడతారే అంచనాలు సైతం వ్యక్తమయ్యాయి.

రాజకీయాలకు నో..
ఆ వార్తలు, అంచనాలు, విశ్లేషణలు ఏవీ కూడా వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కనిపిస్తోన్నాయి. ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస పార్టీలో చేరతారనే ప్రచారానికి తెర దించింది ఆయనకు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. ఐ-ప్యాక్. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరట్లేదని స్పష్టం చేసింది. ఏ పార్టీకి కూడా రాజకీయ వ్యూహకర్తగా పని చేయట్లేదనీ తెలిపింది. వచ్చే ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉంటారని పేర్కొంది.

అయిదు రాష్ట్రాల ఎన్నికలకు దూరం..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను కొంత విరామం తీసుకుంటానంటూ చేసిన ప్రకటనకు ప్రశాంత్ కిషోర్ కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి అసైన్మెంట్లను తీసుకోవట్లేదని ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని ఇండియాటుడే ప్రచురించింది.
రాజకీయాల నుంచి తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత స్పష్టం చేశారని, దానికి అనుగుణంగా ప్రస్తుతం ఆయన ఎన్నికల సర్వేలు, ఇతరత్రా కార్యకలాపాల్లో పాల్గొనట్లేదని పేర్కొంది.

సమాజ్వాది తరఫున..
ఆయన భవిష్యత్ ప్రణాళికల గురించి ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుందని ప్రశాంత్ కిషోర్ సన్నిహితుల స్పష్టం చేసినట్లు ఇండియా టుడే తన కథనంలో తెలిపింది. ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహాలకు దూరంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆయన అఖిలేష్ యాదవ్, సమాజ్వాది పార్టీ కోసం పని చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Recommended Video

శరద్ పవార్తో భేటీకీ
నిజానికి- ఆయన రాష్ట్రపతి ఎన్నికల కోసం పని చేస్తోన్నారని, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద పవార్ను గెలిపించడానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఇదివరకు వార్తలొచ్చాయి. శరద్ పవార్ను సైతం ఆయన కలిశారు. అదే సమయంలో 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా యూపీఏను అధికారంలోకి తీసుకుని రావడం, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికోసం ఆయన కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు కూడా వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications