ఇప్పటి వరకు వైసీపీ... ఇప్పుడు మరో పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
ముంబై: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ శివసేనతో జతకట్టనున్నారా...? ఆయన వ్యూహాలను శివసేన గెలుపునకు అమలు చేయనున్నారా...? 2019 ఎన్నికలకు ఇప్పటికే వైసీపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు శివసేనకు సహాయం చేయనున్నారా... అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
నరేంద్ర మోడీ చరిష్మాకు తోడైన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు
ప్రశాంత్ కిషోర్... 2014 ఎన్నికల్లో ప్రముఖంగా వినపడిన పేరు. ప్రధాని నరేంద్ర మోడీ తన చరిష్మాతో 2014లో అధికారంలోకి రాగా... అంతకంటే ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ అమలు చేసిన వ్యూహాలతోనే మోడీ ప్రధాని పీటంపై కూర్చున్నారనే చెప్పాలి. ఆ తర్వాత దక్షిణాదిన వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తన సొంత రాష్ట్రం బీహార్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి ఆకర్షితుడై ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ను తన పార్టీలో చేర్చుకోవాల్సిందిగా అమిత్ షా తనను పదేపదే కోరడంతో చేర్చుకున్నట్లు నితీష్ కుమార్ బాంబు పేల్చారు.
త్వరలో శివసేనకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్..?
ఇక ఇప్పటివరకు వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్...ఇప్పుడు శివసేనతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు మాత్రమే కాకుండా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా తన సలహాలు సూచనలు శివసేన పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఇవ్వనున్నట్లు సమాచారం. శివసేన ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇంట్లో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. థాక్రేతో పాటు శివసేన ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రశాంత్ కిషోర్ రానున్న లోక్సభ ఎన్నికలు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీకి మార్గదర్శకాలు చేసేందుకు ఒప్పుకున్నట్లు శివసేన ఎంపీ ఒకరు సమావేశం తర్వాత తెలిపారు. అంతేకాదు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తమకు ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేశారని చెప్పిన ఎంపీలు... ఇకపై ప్రశాంత్ కిషోర్ శివసేనకు తన సహకారాన్ని అందిస్తారని చెప్పారని ఎంపీలు వెల్లడించారు.
ముందుగా మహారాష్ట్ర స్థానిక సమస్యలపై పోరాటం చేయండి: ప్రశాంత్ కిషోర్
మహారాష్ట్రలో స్థానిక సమస్యలు ముందుగా తీసుకుని దానిపై పోరాటం చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఎంపీలు చెప్పారు. ఆ తర్వాత ప్రచారంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, మీడియా మేనేజ్మెంట్ ఎలా ఉండాలనేదానిపై కిటుకులు చెబుతానని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు ఎంపీలు వెల్లడించారు. అంతేకాదు ముందుగా శివసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావాలనే దిశగా పనిచేయాలని ఉద్ధవ్ తమకు సూచించారని చెప్పారు. దానికోసం ఇప్పటి నుంచే పనిచేస్తే సెప్టెంబరు కల్లా ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఉద్దవ్ స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ శివసేనలు కలవబోతున్నారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. అయితే మహారాష్ట్రలో శివసేనకు వ్యూహకర్తగా మాత్రమే ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తారని అంతకుమించి పొత్తుల విషయంలో కానీ ఇతరత్రా విషయంలో కానీ ప్రశాంత్ కిషోర్ జోక్యం చేసుకోబోరని ఎంపీలు స్పష్టం చేశారు.