గర్భవతిని చేసి సౌదీ వెళ్లిపోయాడు: సుష్మాకు యువతి ఆవేదన
ముంబై/న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ఓ యువతి(25) తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించుకుంది. తాను ఓ వ్యక్తిని ప్రేమించాననని, అతడు తనను పెళ్లి చేసుకుంటానని శరీరకంగా లోబర్చుకున్నాడని తెలిపింది.
అంతేగాక, తాను ఇప్పుడు గర్భవతినని, అతడు మోసం చేసి సౌదీలోని రియాద్ వెళ్లిపోయాడని తెలిపింది. అతడ్ని ఎలాగైనా మనదేశానికి రప్పించి తనకు న్యాయం చేయాలని కోరింది ముంబైలోని కండీవ్లీ ప్రాంతానికి చెందిన ఆ యువతి.
జబియుల్లా ఖాన్ అనే వ్యక్తితో అక్టోబర్ 2015 నుంచి తాను సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపింది. అతడు ఇప్పుడు రియాద్లోని భారత ఎంబసీలో క్లర్క్గా పని చేస్తున్నట్లు చెప్పింది. పేస్బుక్ ద్వారా అతనితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత 10నెలలపాటు సెల్ఫోన్లో మాట్లాడుకున్నామని తెలిపింది.
2016, ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్కు చెందిన ఖాన్.. ముంబైలోని తనను కలిసేందుకు వచ్చాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని తనతో ఐదు రోజులపాటు గడిపాడని తెలిపింది. తనను శరీరకంగా లోబర్చుకున్న ఖాన్.. రియాద్ వెళ్లి వచ్చిన తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని వెల్లడించింది.
జూన్ నెలలో వస్తానని చెప్పిన అతడు.. ఇప్పటి వరకు కూడా రాలేదని బాధిత యువతి వాపోయింది. అంతేగాక, పెళ్లి కోసమని తనతో రూ. 10లక్షల విలువ చేసే సామాగ్రిని కొనుగోలు చేయించాడని తెలిపింది. కాగా, తాను అప్పటికే ఐదు వారాల గర్భవతినని, తాను అబార్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. అతడు తనను ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం ఉండటంతో డిఎన్ఏ పరీక్ష చేసుకుని ఆ రిపోర్టులను తన వద్దే ఉంచుకున్నట్లు తెలిపింది.
ఖాన్ తిరిగిరాకపోవడంతో ఖండీవ్లీ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసినట్లు బాధిత యువతి తెలిపింది. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. విదేశాంగ శాఖకు తాము లేఖ రాశామని, జవాబు కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు చెబుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాను సుష్మా స్వరాజ్కు వ్యక్తిగతంగా లేఖ రాసినట్లు బాధితురాలు వెల్లడించింది.
నిందితుడు తనతోపాటు మరో ముగ్గురు యువతులను కూడా మోసం చేసినట్లు బాధిత యువతి తెలిపింది. అతని బాధితుల్లో ఒకరు ఇండోనేషియాకు చెందిన వారు కాగా, మరొకరు ఢిల్లీకి చెందిన యువతని, ఇంకొకరు అతని సొంత ప్రాంతానికి చెందిన యువతని పేర్కొంది. తాను ఖాన్ స్నేహితుడికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
కాగా, ఆగస్టు 10, 19 తేదీల్లో తనకు ఖాన్ ఫోన్ చేశాడని, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోకపోతే... యాసిడ్ దాడికి పాల్పడతానని హెచ్చరించాడని బాధిత యువతి తెలిపింది. ఇది ఇలా ఉండగా, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ముకుంద్ పవార్ తెలిపారు. నిందితుడు విదేశాల్లో ఉన్నందున, తాము నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.