రాష్ట్రపతి ఎన్నికల విశ్లేషణ- గెలిచినా తగ్గిన ముర్ము ఓట్లు-ఓడినా పెరిగిన యశ్వంత్ సిన్హా ఓట్లు
భారత రాష్ట్రపతి పదవికి తాజాగా జరిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఎన్నో మల్లగుల్లాల తర్వాత ఎన్డీయే, విపక్షాలు ద్రౌపదీ ముర్ము, యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్దులుగా ఖరారు చేశాయి. ఎన్డీయేతో పాటు తటస్ధంగా ఉండే ఇతర పార్టీలు కూడా ముర్ముకు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. అదే సమయంలో విపక్ష పార్టీలతో పాటు టీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చాయి. చివరికి ముర్ముయే గెలిచారు. అయితే గణాంకాలు మాత్రం ఎన్డీయేకు షాకిచ్చాయి.

రాష్ట్రపతిగా గెలిచిన ద్రౌపదీ ముర్ము
తాజాగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులతో కూడిన ఎలక్ట్రోరల్ కాలేజ్ భారీ మెజారిటీతో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్మును కొత్త రాష్ట్రపతిగా ఎన్నుకుంది. దీంతో ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ఈ నెల 25న బాధ్యతలు చేపట్టబోతున్నారు. కేంద్రంలో అధికార ఎన్డీయే కూటమి నిలబెట్టిన ముర్ముకు.. కూటమిలోని పార్టీలతో పాటు దేశంలోని పలు తటస్ధ, ఏ కూటముల్లోనూ లేని పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె విజయం నల్లేరుపై నడకగానే సాగింది. అదే సమయంలో పలువురు విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఆమెకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో ముర్ము విజయానికి అడ్డేలేకుండా పోయింది.
ఓట్లలో వెనుకబడ్డ ముర్ము
రాష్ట్రపతి పోరులో ద్రౌపదీ ముర్ము మొత్తం 2824 ఓట్లు సాధించారు. ఈ మొత్తం ఓట్ల విలువ 6,76,803గా లెక్కించారు.
అంటే ఇది పోలైన మొత్తం ఓట్లలో 64.03 శాతంగా నిర్దారణ అయింది. దీంతో ముర్ము దాదాపు వెయ్యి ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రపతి పదవి చేపట్టబోతున్నారు. అయితే ముర్ము కంటే ముందు రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ తో పోలిస్తే మాత్రం ఆమెకు తక్కువ ఓట్లే పడ్డాయి. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు 7,02,044 (65.61 శాతం) ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కంటే ముర్ము వెనుకబడినట్లయింది.

యశ్వంత్ సిన్హాకు పెరిగిన ఓట్లు
అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ఆశించిన దాని కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. విపక్షాల్లో ఐక్యత లేకపోవడం, ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినా, తటస్ధ పార్టీలు కలిసి రాకపోయినా యశ్వంత్ సిన్హాకు మాత్రం ఎక్కువ ఓట్లే పడ్డాయి. మొత్తంగా చూస్తే యశ్వంత్ సిన్హాకు ఈ పోరులో 1877 ఓట్లు దక్కాయి. వీటి విలువ 3,80,177గా ఉంది. యశ్వంత్ సిన్హాకు దక్కిన ఓట్ల శాతం 35.97గా నమోదైంది. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీచేసిన మీరా కుమార్ కి 3,67,314 (34.35 శాతం) ఓట్లు వచ్చాయి. దీంతో రాష్ట్రపతి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎన్డీయేకు ఎదురుదెబ్బ ?
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్డీయే అభ్యర్ధి ముర్ముకు మద్దతుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జరిగింది. పైగా గతం కంటే ఎక్కువ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయినా గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకపోవడంపై దేశంలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ అభ్యర్థికి పెరగాల్సిన ఓట్లు గతం కంటే తగ్గాయి.
అదే సమయంలో ప్రతిపక్షాల అభ్యర్థికి తగ్గాల్సిన ఓట్లు కాస్తా పెరిగాయి. దీంతో విపక్షాలకు ఈ విషయంలో ఊరట లభిస్తోంది. ఇంత అనుకూలమైన పరిస్ధితుల్లోనూ ఎన్డీయే అభ్యర్ధి ఒకశాతం ఓట్లు తక్కువగా తెచ్చుకోవడం భవిష్యత్ రాజకీయాలకు సంకేతమని విపక్షాలు చెప్పుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications