ప్రధాని మోడీపై పొగడ్తలు: శశి థరూర్ పవర్ కట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించినందుకు కాంగ్రెసు నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మూల్యం చెల్లించారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి కాంగ్రెసు పార్టీ ఆయనను తొలగించింది. తక్షణమే శశి థరూర్ను ఎఐసిసి అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణా సంఘం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిపార్సు చేసింది. ఆ సిఫార్సును సోనియా అంగీకరించారు.
నరేంద్ర మోడీని ప్రశంసించడంపై కేరళ కాంగ్రెసు పార్టీ క్రమ శిక్షణా సంఘానికి థరూర్పై ఫిర్యాదు చేసింది. ఆ విషయాన్ని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఓ ప్రకటనలో తెలిపారు. థరూర్పై కేరళ కాంగ్రెసు పార్టీ ఓ నివేదికను తయారు చేసి, దాన్ని కొద్ది రోజుల క్రితం క్రమశిక్షణా సంఘానికి సమర్పించింది.

శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ చేస్తున్న ప్రకటనలు పార్టీ కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తున్నాయని కేరళ కాంగ్రెసు ఫిర్యాదు చేసింది. తిరువనంతపురం లోకసభ సీటులో విజయానికి పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేశారని, వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా థరూర్ ప్రకటనలు చేస్తున్నారని అన్నది.
కేరళ కాంగ్రెసుపై శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. చెవుల ద్వారా వినడానికి బదులు తాను ఏం రాశానో కేరళ కాంగ్రెసు పూర్తిగా చదవాలని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ శశి థరూర్ను ఆహ్వానించారు. ఆహ్వానాన్ని థరూర్ మన్నించారు. ఈ సమయంలో కేరళ కాంగ్రెసు కమిటీ ఆయనపై ఫిర్యాదు చేసింది.
మోడీ పర్యటన సందర్భంగా శశి థరూర్ అమెరికా వెళ్లి పలు టీవీ చానెళ్లలో కనిపించారు. మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికాలో ఉండి, అక్కడి టీవీ చానెళ్లలో మాట్లాడాలని ఎవరూ థరూర్కు సూచించలేదని కాంగ్రెసు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications