కర్ణాటకలో హైడ్రామా! రోడ్డెక్కిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
బెంగళూరు: ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో బెంగళూరులో హైడ్రామా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు రోడ్డెక్కారు. ధర్నా నిర్వహించారు. నిరసన ప్రదర్శన చేపట్టారు. నడిరోడ్డుపై బైఠాయించారు. భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. దీనికంతటికీ కారణం ఒక్కటే- ఆదాయపు పన్ను శాఖ దాడులు.
పరీక్ష పేపర్ లలో పార్టీలపై , పార్టీ నేతలపై ప్రశ్నలు .. మొన్న ఏపీ నేడు బెంగుళూరు ఇదెక్కడి రాజకీయం
ఐటీ దాడుల రగడ
గురువారం ఉదయం కేంద్ర ఆదాయపు పన్నుశాఖ అధికారులు కర్ణాటకలోని కొన్ని కీలక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎన్నికల బరిలో నిల్చున్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు కొనసాగాయి. జేడీఎస్ కు చెందిన కొందరు కీలక నాయకుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. మండ్యలో జేడీఎస్ నాయకుడు, కర్ణాటక చిన్నతరహా నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు సహా మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప నివాసాలపై ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. బెంగళూరు సహా మండ్య, మైసూరు, హాసన జిల్లాల్లో ఒకేసారి 17 మంది కాంట్రాక్టర్లు, ఏడుమంది అధికారుల ఇళ్లల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
సంకీర్ణ సర్కార్ కు సెగ
పోలింగ్ కు సరిగ్గా నెలరోజుల వ్యవధి కూడా లేని ప్రస్తుత తరుణంలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఐటీ దాడుల వ్యవహారం కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల్లో కలకలం రేపాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న ఆ రెండు పార్టీల నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించుకుని రాజధానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి.. బెంగళూరులో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారు మూడుగంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం- వారంతా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
ఓటమి తప్పదనే భయంతోనే..
కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరప్ప, భారీ నీటి పారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు సహా ఆ రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎండ వేడి తీవ్రంగా ఉన్నప్పటికీ.. వారు పట్టించుకోలేదు. ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. నిరసన తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతో, బీజేపీ ప్రభుత్వం.. తమ పైకి ఆదాయపు పన్ను దాడులను చేయిస్తోందంటూ ఆరోపించారు. వెంటనే ఈ దాడులను ఉపసంహరించుకోవాలని, అధికారులను వెనక్కి పిలిపించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రమంత్రి నివాసంపై దాడులు చేసే అధికారం ఐటీ అధికారులకు లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం పాలు కావడం తథ్యమని వారు అన్నారు. ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ నాయకులు ఆదాయపు పన్ను శాఖ అధికారులను అడ్డు పెట్టుకని భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.