ఢిల్లీ ఆకలితో అల్లాడే ప్రమాదం?, నిరసన రాజ్యాంగబద్దమైన హక్కు.. కానీ.. : రైతు ఆందోళనలపై సుప్రీం
రైతులకు నిరసన తెలియజేసే హక్కు ఉందని... అయితే నిరసన పేరుతో రోడ్లను దిగ్భంధించకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కుని సుప్రీం కోర్టు గుర్తిస్తుందని... అయితే ఆ నిరసనతో ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకూడదని తెలిపింది. ఢిల్లీ బోర్డర్లో రోడ్లను దిగ్బంధించడం ద్వారా నగరంలోని ప్రజలు ఆకలితో అల్లాడే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. చర్చల ద్వారా మాత్రమే రైతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని... కేవలం నిరసనలో కూర్చోవడం ద్వారా ఎటువంటి పురోగతి ఉండదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ సరిహద్దుల్లో గత 23 రోజులుగా ఆందోళన చేపడుతున్న రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం(డిసెంబర్ 17) విచారణ చేపట్టింది.

ఆందోళనలతో ఢిల్లీలో సప్లై చైన్కు బ్రేక్...
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. పిటిషనర్లలో ఒకరి తరుపున వాదించిన న్యాయవాది హరీష్ సాల్వే... 'నిరసన తెలియజేయడం పౌరుల ప్రాథమిక హక్కు... కానీ అది ఇతర ప్రాథమిక హక్కులతో సమతుల్యతను కలిగి ఉండాలి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధిస్తే గూడ్స్ సప్లై చైన్కు బ్రేక్ పడి ఢిల్లీలో ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతాయి. గుర్గావ్ లేదా నోయిడాలో ఉండి ఢిల్లీలో ఉద్యోగాలు చేసేవారు ఈ ఆందోళనల కారణంగా కార్యాలయాలకు వెళ్లలేక ఉద్యోగాలు పోగొట్టుకుంటే దానికి బాధ్యులు ఎవరు..?' అని ప్రశ్నించారు.

ఈ పద్దతి సరికాదు : హరీష్ సాల్వే
కోవిడ్ 19 పీరియడ్లో ఇంత భారీ సంఖ్యలో జనం గుమిగూడి ఆందోళనలు చేపట్టడం ఎదుటివారి జీవించే హక్కుకు భంగం కలిగించడమేనని సాల్వే అభిప్రాయపడ్డారు. ఒకరకంగా రైతు సంఘం కూడా ఒక రాజకీయ పార్టీయే అని... ఇంత భారీ ఎత్తున జనాన్ని సమీకరించేవాళ్లను వారికి బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా సరే ఒక నగరాన్ని దిగ్బంధించడం... తమ డిమాండును ప్రభుత్వం నెరవేర్చకపోతే మొత్తం దేశాన్నే స్తంభింపజేస్తామనడం సరికాదని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు.

చర్చలతోనే పురోగతి... : సుప్రీం కోర్టు
సాల్వే వాదనలపై స్పందించిన కోర్టు... ఒక చట్టం పట్ల నిరసన తెలియజేసే పౌరుల ప్రాథమిక హక్కును తాము గురిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే ఆ నిరసన ఇతరుల జీవితానికి ఇబ్బందులు సృష్టించకూడదని పేర్కొంది. నిరసన విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని.. అయితే నిరసన జరుగుతున్న తీరును మాత్రం పరిశీలిస్తుందని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. నిరసనకు ఒక లక్ష్యం ఉంటుందని... అయితే అది కేవలం నిరసనలో కూర్చోవడం ద్వారా మాత్రమే సాధ్యపడదని పేర్కొంది. సమస్య పరిష్కారానికి కేంద్రం-రైతుల మధ్య చర్చలు జరగాలని... ఈ విషయంలో సుప్రీం కోర్టు చొరవ తీసుకుంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications