16 నుంచి కరోనా వ్యాక్సినేషన్: పల్స్ పోలియో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: హెల్త్ వర్కర్లపై
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. పల్స్ పోలియో క్యాంపెయిన్పై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కేంద్రం పూర్తిస్థాయిలో సమాయాత్తమౌతోన్నందున.. పల్స్ పోలియోను నిర్వహిస్తారా? లేదా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం తెర దించింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 17వ తేదీన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. దానికి ఒక్క రోజు ముందే అంటే.. శనివారమే కేంద్రం కరోనా వైరస్ వ్యాక్సినేషన్ను నిర్వహించబోతోన్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మంగళవారం నుంచి ఆరంభం కాబోతోంది. వ్యాక్సిన్ల రవాణా, వాటిని భద్రపరచడం, వ్యాక్సినేషన్ సెంటర్లకు పంపిణీ చేయడం వంటి పనులన్నింటినీ 15వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం దీనిపైనే నిలిచింది.
ఈ పరిణామాల మధ్య 17వ తేదీ నాడే పల్స్ పోలియోను నిర్వహించాల్సి రావడం వల్ల పాలనపరంగా కొంత గందరగోళం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే పల్స్ పోలియో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చేనెల మొదటి ఆదివారం పల్స్ పోలియోను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై జాతీయ ఇమ్యునైజేషన్ సలహాదారు ప్రదీప్ హల్డర్ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని హెల్త్ వర్కర్లను నిర్వహిస్తుంటారు. వారికి శనివారమే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్పి ఉంటుంది. ఆ మరుసటి రోజే పల్స్ పోలియో వంటి భారీ కార్యక్రమాన్ని వారికి అప్పగించడం సహేతుకం కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి మళ్లీ హెల్త్ వర్కర్లపైనే ఆధారపడాల్సి వస్తుందని, సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ రెండింట్లోనూ వారి పాత్ర కీలకం కావడం వల్ల పల్స్ పోలియోను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.