2,000 సార్లు, 238 గంటల పాటు సంభాషణలు.. కేతన్ హత్యకేసులో షాకింగ్ విషయాలు!
పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ విషయం బయటపడింది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సియా గోయల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. జూన్ 18న కేతన్ ను లోహ్ గడ్ కోటపై నుండి క్రిందికి తోసి హతమార్చారు.
వివాహం రద్దు కంటే కేతన్ ను చంపేయటమే ఈజీ అని భావించిన సియా
సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి హత్యకు పథకం రచించినట్లు విచారణలో తేలింది. ఇంట్లో తల్లిదండ్రులకు ఈ సంబంధం గురించి చెప్పి వివాహం రద్దు చేయడం కంటే కేతన్ను చంపేయడమే సులభమని సియా భావించినట్లు, అందుకే ఇంత ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లి రద్దు కావటంతో పాటు, తనకు మరో మూడేళ్ళు గ్యాప్ దొరుకుతుందని సియా ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అన్ని కోణాలలోనూ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పుణె రూరల్ పోలీసులు ఈ కేసును అన్ని కోణాలలోనూ విచారిస్తున్నారు. ఆరు బృందాలు ఏర్పాటు చేసి సియా గోయల్ తల్లిదండ్రులు, సోదరుడు సాహిల్ను విచారించారు. సాహిల్ విచారణలో చేతన్ చౌదరి తనకు తెలుసని, సోదరి ఒక క్రికెట్ మ్యాచ్లో అతనిని పరిచయం చేసినట్లు వెల్లడించాడు. చేతన్ చౌదరితో సియా గోయల్ పరిచయాన్ని, వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యాన్ని గురించి పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.
2,000 సార్లు దాదాపు 238 గంటల పాటు సంభాషణలు
గత ఏడాది దీపావళి పార్టీలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. చేతన్, సియా మధ్య జనవరి నుంచి 2,000 సార్లు దాదాపు 238 గంటల పాటు సంభాషణలు జరిగినట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయి. నిందితులు డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో కుట్ర కోణాన్ని రుజువు చేసేందుకు ఈ సాక్ష్యాలు కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
కేసులో రోజుకో ట్విస్ట్
ఈ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసులు మరిన్ని వివరాలను బయటపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా వారి మొబైల్స్ లో డిలీట్ చేసిన డేటా రికవర్ చేస్తే కేతన్ హత్యకు గల అసలు కారణాలు బయటకు వస్తాయి.












Click it and Unblock the Notifications