సీఎం భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. ముఖ్యమంత్రికి బిగ్ షాక్!
Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య గురుప్రీత్ కౌర్పై వచ్చిన తీవ్ర ఆరోపణలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ లైంగిక వేధింపుల కేసును నీరుగార్చేందుకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించి నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వివాదం మరింత ముదిరింది. పంజాబ్ అభివృద్ధి, సుపరిపాలన అంటూ మాటలు చెప్పే ఆప్ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని బీజేపీతో పాటు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు సీఎం భగవంత్ మాన్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి.
రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. రంగంలోకి దిగిన ఎన్హెచ్ఆర్సీ
ఓ రిటైర్ జడ్జి బహిరంగంగా చేసిన కామెంట్స్ ఆధారంగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఓ లైంగిక వేధింపుల కేసును మూసివేసేందుకు సీఎం సతీమణి గురుప్రీత్ కౌర్ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అందిన ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సభ్యుడు ప్రియాంక్ కామాన్గో తీప్రంగా స్పందించారు. పంజాబ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తూ.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖలోని మహిళా భద్రతా విభాగానికి కూడా తెలియజేశారు.

సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్
జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసుల అనంతరం ప్రతిపక్షాలు సీఎం భగవంత్ మాన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. బీజేపీ నేత ఇక్బాల్ సింగ్ లాల్పురా ఈ ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి వెంటనే దీనిపై నోరు విప్పాలని.. అంతవరకు బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శిరోమణి అకలీదళ్ నేతలు కూడా సీఎం రాజీనామాకే పట్టుబడుతుండటంతో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆరోపణలను ఖండించిన ఆప్
మరోవైపు ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని.. బొత్తిగా ఆధారాలు లేని అసత్యాలు అని ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు అమన్దీప్ కౌర్ అరోరా పేర్కొన్నారు. గురుప్రీత్ కౌర్ ఇప్పటికే ఆరోపణలు చేసిన రిటైర్డ్ జడ్జి రంజిత్ సింగ్కు లీగల్ నోటీసు పంపారని వెల్లడించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సర్వత్రా జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ, పంజాబ్ ప్రభుత్వం ఇచ్చే నివేదికపైనే దృష్టి నెలకొంది.












Click it and Unblock the Notifications