ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటి దారుణ హత్య
బెంగళూరు: పొట్టకూటి కోసం సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న యువకుడు నగదు లూటీ చెయ్యడానికి వచ్చిన దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. బెంగళూరు నగరంలోని టిన్ ఫ్యాక్టరి సమీపంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాంకు చెందిన మినత్ వుల్లా (25) బెంగళూరు ఉంటున్నాడు. కేఆర్ పురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నన్యూ లైట్ హోటల్ సమీపంలోని యూనియన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఇతను సెక్యూరిటిగార్డుగా పని చేస్తున్నాడు.
శనివారం రాత్రి మినత్ విధులకు వెళ్లాడు. ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో దుండగులు ఏటీఎం కేంద్రంలో నగదు లూటీ చెయ్యడానికి వెళ్లారు. చప్పుడు కావడంతో మినత్ ఏటీఎం కేంద్రం నుండి బయటకు వచ్చాడు.
అదే సమయంలో నిందితులు ఇనుప రాడ్ తీసుకుని అతని తల మీద దాడి చేశారు. ఏటీఎం కేంద్రంలోనే అతని కాళ్లు, చేతులు కట్టి వేసి నోటికి ఫ్లాస్టర్ వేశారు. అనంతరం ఏటీఎం యంత్రం పగలగొట్టి నగదు లూటీ చెయ్యడానికి విఫలయత్నం చేశారు.
నగదు రాకపోవడంతో మినత్ ను చంపేశారు. తరువాత అదే కట్టడం మీద చెత్త వేసే చోట మినత్ మృతదేహం విసిరివేసి ఏటీఎం కేంద్రం షట్టర్ మూసివేసి పరారయ్యారు. ఆదివారం మద్యాహ్నం విషయం వెలుగు చూసింది. ఏటీఎం యంత్రంలోని సీసీ కెమెరాలో, బయట ఉన్న సీసీ కెమెరాలలో దుండగులు సంచరించి, హత్య చేసిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
విషయం తెలుసుకున్న డీసీపీ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించామని, సెక్యూరిటిగార్డును హత్య చేసి నగదు లూటీ చెయ్యడానికి ప్రయత్నించిన దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని డీసీపీ సతీష్ కుమార్ తెలిపారు.