బెంగళూరులో జాతివివక్ష దాడి ? కోమాలో యువకుడు
బెంగళూరు: బెంగళూరులో ఓ యువకుడు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిపోవడంతో పెద్ద రచ్చ అయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్రగాయాలైనాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జాతివివక్షతో యువకుడిపై హత్యాయత్నం జరిగిందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
కౌధన్ కంగమ్ (22) అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యి బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. కౌధన్ కంగమ్ నాలుగు నెలల క్రితం బెంగళూరు చేరుకుని వివేక్ నగర్ లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు.
ఇతను కోరమంగలలోని ఓ పబ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి పబ్ నుంచి ఇంటికి బయలుదేరాడు. అయితే కౌధన్ కంగమ్ రూంకు చేరుకోకపోవడంతో ఆదివారం వేకువ జామున అతని స్నేహితుడు పబ్ దగ్గరకు బయలుదేరాడు.
కోరమంగల దగ్గర తీవ్రగాయాలై రోడ్డు పక్కన కౌధన్ కంగమ్ పడిపోయి ఉన్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి గుర్తు తెలియని వాహనం ఢీకొందని కేసు నమోదు చేశారు.
ఇనుప రాడ్లతో దాడి చెయ్యడం వలనే కౌధన్ కంగమ్ కు తీవ్రగాయాలైనాయని కర్ణాటక అరుణాచల ప్రదేశ్ స్టూడెంట్స్ సంఘం అధ్యక్షుడు టోకో జాన్ ఆరోపించారు. కౌధన్ కంగమ్ ను గుర్తించిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ విషయంపై పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సౌత్ ఈస్ట్ డీసీపీ బోరలింయ్య చెప్పారు. అరుణాచలప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే గాబ్రియేట్ దీవాంగ్ వాగ్సూ ఇటానగర్ లో మీడియాతో మాట్లాడుతూ జాతి వివక్షతో దాడి చేసి కౌధన్ కంగమ్ ను వాహనంలో నుంచి కిందకు విసిరివేశారని ఆరోపించారు.
కర్ణాటక పోలీసులతో మాట్లాడాలని తాను అరుణాచలప్రదేశ్ ముఖ్యమంత్రికి మనవి చేశామని ఎమ్మోల్యే గాబ్రియేట్ దీవాంగ్ వాగ్సూ అన్నారు. బెంగళూరులో నిత్యం ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు.