అతిపెద్ద ఐసొలేషన్ వార్డుగా రాధాస్వామి సత్సంగ్ క్యాంపస్: 10 వేల పడకలతో కరోనా ట్రీట్మెంట్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది దేశ రాజధాని. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్యలో మహారాష్ట్రను మించిపోయింది. కరోనా కల్లోలాన్ని నియంత్రించడానికి ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా.. లాక్డౌన్లను అమలు చేసినా వైరస్ ఉధృతికి ఏ మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. రోజురోజుకూ గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో అక్కడ నమోదవుతున్నాయి.
24 గంటల వ్యవధిలో దేశ రాజధానిలో 2134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో అదుపు తప్పిందనేది అర్థం చేసుకోవచ్చు. 38,958 పాజిటివ్ కేసులు న్యూఢిల్లీలో నమోదు కాగా.. వాటిల్లో 1271 మంది మృత్యువాత పడ్డారు. నానాటికీ పరిస్థితి అధ్వాన్నంగా మారుతుండటంతో కట్టడి మాట అటుంచి.. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు వైద్య చికిత్సను అందించడంపై దృష్టి పెట్టింది ఢిల్లీ ప్రభుత్వం.
ఇందులో భాగంగా అతిపెద్ద ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ ఛత్తార్పూర్ ప్రాంతంలోని రాధాస్వామి సత్సంగ్ బియాస్ క్యాంపస్లో దీన్ని నెలకొల్పబోతోంది. ఒకేసారి 10 వేల మంది కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందించడానికి అవసరమైన ఏర్పాట్లను ఈ క్యాంపస్లో అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. రెండు రోజుల్లో ఈ క్యాంపస్ను కరోనా పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది.
దీనికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం మధ్యహ్నం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ పనులను పరిశీలించారు. దేశ రాజధానిలో అనూహ్యంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, దీనికి అనుగుణంగా వైద్యాన్ని అందించడానికి అవరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉందని అన్నారు. ఇందులో భాగంగా- ఒకేచోట 10 వేల మంది పేషెంట్లకు ఒకేసారి వైద్యాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
దీనికోసం రాధాస్వామి సత్సంగ్ బియాస్ క్యాంపస్ను ఎంపిక చేశామని అన్నారు. వేలమంది కరోనా వైరస్ పేషెంట్లకు ఒకేసారి వైద్యాన్ని అందించడానికిి అవసరమైన సౌకర్యం ఇక్కడ ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాధాస్వామి సత్సంగ్ క్యాంపస్ను ఎంపిక చేశామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగాల్సి వస్తే.. మరి కొద్దిరోజుల్లో ఒక్క ఢిల్లీలోనే కనీసం 80 వేల పడకలు అవసరం అవుతాయని అంచనా వేశామని అనిల్ బైజల్ అన్నారు.
Recommended Video
దీనితోపాటు- కేంద్రం 500 రైల్వే బోగీలను ఢిల్లీ ప్రభుత్వానికి అందజేయనుందని, దీనివల్ల మరో ఎనిమిది వేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మున్ముందు మరో 20 వేల పడకలను అదనంగా అందుబాటులోకి తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను చేపట్టామని అన్నారాయన. న్యూఢిల్లీ పరిధిలో 10 నుంచి 49 వరకు పడకల సామర్థ్యం ఉన్న అన్ని నర్సింగ్ హోమ్లను కూడా కోవిడ్ ఆసుపత్రులుగా ప్రకటించినట్లు చెప్పారు.