ప్రధాని రేసులో రాహుల్ లేరు : శరద్ పవార్ సంచలనం
ముంబై : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. బీజేపీయేతర పక్షాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతోందని లెక్కగట్టారు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాలేరని మెలికపెట్టారు పవార్.

ఎన్డీయేతర కూటమి
మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమి ఓటమి తప్పదన్నారు పవార్. బీజేపీయేతర పక్షాలు కేంద్రంలో అధికారం చేపడుతాయని పేర్కొన్నారు. ఆ సమయంలో భాగస్వామ్య పక్షాలు ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలిపారు. కానీ ప్రధాని పదవీ కోసం రాహుల్ గాంధీ పోటీలో లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్ దృష్టి మొత్తం మోదీని ఓడించడంపై ఉందని పేర్కొన్నారు.
మెజార్టీ సీట్లు కాంగ్రెస్సే
భాగస్వామ్యపక్షాలతో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు పవార్. కాంగ్రెస్ పార్టీ 100, అంతకన్నా ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తోందని చెప్పారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ అభ్యర్థిత్వాన్ని అన్నీ పార్టీలు అంగీకరించాయని .. ఈ సారి పదవీ కోసం పోటీ ఉందనే తన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ లేదంటే మిత్రపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు.
అధికారానికి అడుగుదూరంలో ..
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజార్టీ సీట్లు గెలిచినా .. అధికారం చేపట్టడానికి కాస్త దూరంలో నిలుస్తోందని పేర్కొన్నారు. పనిలోపనిగా బీజేపీ తీరును ఎండగట్టారు. ఇటీవల బీజేపీ, రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ప్రధాని పదవీకి అనర్హుడని ఆరోపిస్తోంది. అలాంటి సమయంలో రాహుల్ టార్గెట్గా ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది బీజేపీ పాత సిద్ధాంతమని .. గతంలో ఇదివరకే విమర్శలు చేసేవారని గుర్తుచేశారు. తమకు భవిష్యత్లో ఇబ్బంది లేని నేతలను ఎంపిక చేసుకొని విమర్శించేవారని గుర్తుచేశారు. ఇదివరకు మహారాష్ట్రలో తనను, దేశంలో రాహుల్ లక్ష్యంగా విమర్శించారని తెలిపారు.












Click it and Unblock the Notifications