Rahul Gandhi: మహిళలు ఎవరికి సొత్తు కాదు, మనుస్మృతిపై సంచలన కామెంట్స్
సమాజంలో మహిళల స్వేచ్ఛను, వారి హక్కులను అణచివేస్తున్న పితృస్వామ్య ఆలోచనా ధోరణిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉన్న ఐఎస్ఎస్ఎంఎస్ మైదానంలో శనివారం సాయంత్రం వేలాది మంది విద్యార్థినుల మధ్య నిర్వహించిన 'ఛాత్రోం కీ గూంజ్' (విద్యార్థుల ప్రతిధ్వని) వేదికగా ఆయన మాట్లాడారు.
మహారాష్ట్రలో ఆయన పర్యటించిన ఈ తొలి విడత విద్యార్థి సదస్సులో మరాఠీ భాషలో "పుణె అంటే ప్రేమ" అని సంబోధిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించి యువతలో తీవ్ర ఉత్సాహాన్ని నింపారు. భారతదేశానికి 70 కోట్ల మంది పురుషుల కంటే 70 కోట్ల మంది మహిళల ఆలోచనలు, కలలే అత్యంత కీలకమని, వారే ఈ దేశానికి అసలైన శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.

మనుస్మృతి మనస్తత్వంపై విరుచుకుపడ్డ రాహుల్
ప్రస్తుత పాలకుల ఆలోచనా విధానంలో 'మనుస్మృతి' ఆలోచనలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మనుస్మృతిలోని పాత నిబంధనల ప్రకారం మహిళలు బాల్యంలో తండ్రికి, యుక్తవయసులో భర్తకు, వృద్ధాప్యంలో కుమారుడికి లోబడి ఉండాలని, వారు స్వతంత్రంగా ఉండటానికి వీల్లేదని పేర్కొనడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో యువకులు, యువతులు ఇద్దరూ అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ, కేవలం యువతులు మాట్లాడిన భాషను మాత్రమే ప్రధాని మోదీ 'కల్చరల్ షాక్' అని సంబోధించడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ప్రధాని మాట్లాడిన ఆ పాత వీడియో క్లిప్ను సభలోనే డిస్ప్లే స్క్రీన్పై ప్రదర్శించి చూపించారు. అబ్బాయిలు ఎలాంటి భాష వాడినా చెల్లుతుందని, అమ్మాయిలు మాత్రం ఇంట్లో పంజరంలో బందీగా ఉండాలనే ఈ భావజాలం వెనుక మనుస్మృతి ఆలోచనా విధానం దాగి ఉందన్నారు.
महिलाएं हर दिन, हर जगह हिंसा का सामना कर रही हैं। कुछ दिखाई देते हैं, कुछ बिना दिखे आपको, आपके भविष्य को चोट पहुंचा रहे हैं।
— Congress (@INCIndia) August 23, 2026
हमें इस डर और रुकावट को हर हाल में मिटाना है। देश को आपकी पूरी भागीदारी की जरूरत है।#ChhatronKiGoonj pic.twitter.com/m8G5zch1hz
మూడు రకాల హింసతో మహిళల అణచివేత..
సమాజంలో మహిళలను అదుపులో ఉంచడానికి భయం, సమయం, అవమానం అనే ఆయుధాలను ఉపయోగిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు మూడు రకాల తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారని గణాంకాలతో వివరించారు:
- భౌతిక హింస: ప్రతి 100 మంది మహిళల్లో ఆరుగురు అత్యాచారానికి గురవుతున్నారని, అలాగే దేశంలో ఏటా దాదాపు 4.5 లక్షల ఆడ భ్రూణ హత్యలు జరుగుతున్నాయని తెలిపారు.
- అవకాశాల నిరాకరణ: రక్షణ లేదనే భయంతో 50 శాతం మంది మహిళలు ఉద్యోగ అవకాశాలను వదులుకుంటున్నారు. 60 శాతం మంది యువతులు ఒంటరిగా బయటకు వెళ్లలేని వాతావరణం ఉంది. 45 శాతం మంది బాలికలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు.
- ఆర్థిక హింస: భద్రతా కారణాల వల్ల ఒక మహిళ ఏటా సగటున రూ. 17,500 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సమాన పనికి సమాన వేతనం దక్కక, పురుషుల కంటే మహిళలకు 25 శాతం తక్కువ వేతనం లభిస్తోంది. అంతేకాక దేశంలో కేవలం 8 శాతం మంది మహిళల పేరిట మాత్రమే స్వంత ఆస్తులు ఉన్నాయని తెలిపారు.
పంజరం వీడి బయటకు రండి: యువతులకు దిశా నిర్దేశం
దేశంలో జరిగే 99 శాతం లైంగిక వేధింపుల కేసులు అవమానానికి భయపడి బయటకు రావడం లేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. 15 నుండి 29 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు రోజుకు సగటున 5.5 గంటల సమయం ఇంట్లోనే వెచ్చిస్తుంటే, అబ్బాయిలు మాత్రం అరకంట కంటే ఎక్కువ పని చేయడం లేదన్నారు.
"మహిళలు కేవలం తండ్రికో, భర్తకో, కొడుక్కో చెందినవారు కాదు. వారు తమకు తామే సొంతం. కుటుంబ బంధాలు ఉన్నప్పటికీ, వారికి స్వయం గుర్తింపు చాలా అవసరం. క్రీడలు, పారిశ్రామిక, వైజ్ఞానిక రంగాల్లో మహిళలు ఎంతో సున్నితత్వంతో, ముందస్తు చూపుతో రాణిస్తున్నారు" అని కొనియాడారు. హృదయాల్లోని భయాన్ని తొలగించి, సమాజంలో తమ హక్కుల కోసం భయం లేకుండా మాట్లాడాలని, పితృస్వామ్య పంజరాన్ని బద్దలు కొట్టుకుని ముందుకు సాగాలని యువతులకు రాహుల్ పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications