శుభవార్త: రైల్వే ఉద్యోగ నియామక ప్రక్రియ రెండేళ్ల నుంచి ఆర్నెళ్లకు కుదింపు!
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగం కోసం నిరీక్షించే వారికి అతి పెద్ద ఊరట. ఉద్యోగం సంపాదించాలంటే కనీసం రెండేళ్ల పాటు నిరీక్షించవలసి వస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేయడం మొదలు ఉద్యోగం చేతికి వచ్చే వరకు చాలాకాలం చూడవలసి వస్తోంది.
ఇకపై అలాంటి సమస్య ఉండకుండా ఉండేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. రైల్వే నియామక ప్రక్రియను రెండేళ్ల పాటు కాకుండా, ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్స్ సమావేశం జరిగింది. రైల్వేలో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉందనే విషయాన్ని జోనల్ హెడ్స్ లోహానీ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగాల కోసం రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి వస్తోందనే విషయాన్ని నార్త్ ఈస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన లోహానీ నియామక ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేయాల్సిందిగా సూచించారు. దీనిపై డిసెంబర్ 20వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలన్నారు.