రాజస్థాన్ లో రాజ్నాథ్కు అవమానం! గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేందుకు రాని పోలీసులు!
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు అవమానం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
జైపూర్ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు అవమానం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. వాట్సాప్లో చక్కర్లు కొట్టిన ఓ పుకారు కారణంగా కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇటీవలె వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల వారి వేతనాల్లో భారీగా కోతలు పడబోతున్నాయంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో సోమవారం జోధ్ పూర్లో రాజ్నాథ్ సింగ్ పర్యటించగా.. నిరసనలో భాగంగా సుమారు 250 మంది కానిస్టేబుళ్లు సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో రాజ్నాథ్ గౌరవ వందనం స్వీకరించలేకపోయారు.
అధికారులేం చెబుతున్నారంటే...
రాజ్నాథ్కు గౌరవ వందనం దక్కకపోవటంపై రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఆ 250 మందిలో గార్డ్ ఆఫ్ ఆనర్ కోసం నియమించిన కానిస్టేబుళ్లే ఎక్కువ మంది ఉన్నారని, వారికి ఎలాంటి లీవులు మంజూరు చేయలేదని, పైపెచ్చు కచ్ఛితంగా విధులకు హాజరుకావాలని చెప్పామని, అయినా కావాలనే వారు రాలేదని జోధ్ పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ తెలిపారు.
కానిస్టేబుళ్లు ఏమంటున్నారంటే...
మరోవైపు కానిస్టేబుళ్లు మాత్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి భరోసా లభించలేదని.. తమ ఆందోళనను, భయాన్ని కేంద్రానికి చెప్పేందుకు ఇలా చేశామని చెబుతున్నారు.
ఏదిఏమైనా విధులకు డుమ్మా కొట్టినందున వీరికి నోటీసులు పంపి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాజస్థాన్ డీజీపీ అజిత్ సింగ్ తేల్చి చెప్పారు.