రజనీకాంత్ ఆర్థిక నేరగాడు.. ఆయనతో మోడీ ఇక మాట్లాడరు: స్వామి సంచలన వ్యాఖ్యలు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు ఆగడం లేదు. తాజాగా ఆయన రజనీకాంత్ ను ఆర్థిక నేరగాళ్లతో పోల్చారు.
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులంతా గంపెడాశతో ఎదురు చూస్తున్న వేళ, వివాదాస్పద వ్యాఖ్యల నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
రజనీకాంత్ ఆర్థిక నేరగాడని ఆరోపించిన స్వామి, రజనీ నేరాలకు సంబంధించి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని శంకరమఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నుంచి అవార్డును అందుకున్నారు.

ఆపై స్వామి ప్రసంగిస్తూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని, ఇకమీదట ప్రధాని నరేంద్ర మోడీ, రజనీని కలవబోరని అన్నారు. తాజాగా రజనీకాంత్ గురించి సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.
ఇటీవలి కాలంలో రజనీ రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తలు బయటకు వచ్చిన తరువాత, ఆయన స్థానికుడు కాదని, రాజకీయాల్లోకి వచ్చి రాణించలేరని సుబ్రహ్మణ్య స్వామి పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. ఆందోళనల బాటకు దూరంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లతో స్వామిపై దాడికి దిగారు.
సుబ్రహ్మణ్య స్వామిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కమలం పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రజనీని విమర్శించడం మానుకోకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని స్వామికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications