రాజ్నాథ్ హోం, జైట్లీ ఆర్థికం: అద్వానీయే సమస్య
న్యూఢిల్లీ: కాబోయే ప్రదాని నరేంద్ర మోడీ మంత్రివర్గ కూర్పునకు కసరత్తు జరుగుతోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు హోం మంత్రిత్వ శాఖ దక్కే అవకాశం ఉంది. సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖను నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే, అగ్రనేత ఎల్కె అద్వానీ విషయంలో ఎలా వ్యవహరించాలనేది బిజెపి నాయకత్వానికి అంతు చిక్కడం లేదు.
భీష్ముడి వంటి అద్వానీకి స్థానాన్ని గుర్తించడం బిజెపికి సమస్యగానే ఉంది. కీలకమైన ఆర్థిక, హోం శాఖలకు మోడీ మంత్రులను గుర్తించినప్పటికీ మరో రెండు కీలకమైన విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలను ఎవరికి ఇవ్వాలనే విషయంపై నిర్ధారణకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.
సుష్మా స్వరాజ్ వరుసలో ఉన్నప్పటికీ, ఆమెను నరేంద్ర మోడీ విశ్వాసంలోకి తీసుకుంటారా, లేదా అనేది అనుమానంగా ఉంది. అయితే, ఆమెకు ముఖ్యమైన మానవ వనరులు, ఆరోగ్యం వంటి శాఖలను కేటాయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సుష్మా స్వరాజ్ సోమవారం మోడీని కలిశారు. ఆమె మర్యాదపూర్వకంగా మాత్రమే మోడీని కలిశారు.
మిత్రుల్లో రాం విలాస్ పాశ్వాన్కు ప్రధానమైన శాఖనే కేటాయించే అవకాశం ఉంది. బీహార్లో మంచి ఫలితాలు రాబట్టడానికి పాశ్వాన్ పొత్తు పనికి వచ్చింది.