రాజ్యసభ పోల్స్: ఆ 2 రాష్ట్రాల ఫలితాలు విడుదల; బీజేపీ, కాంగ్రెస్ చెరో మూడు స్థానాల్లో గెలుపు
న్యూఢిల్లీ: రాజ్యసభ 16 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో మాత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఫిర్యాదుతో హర్యానా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం.
ఈ రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి.కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగగా.. మూడు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ నటుడు, రాజకీయ నేత జగ్గేశ్, మాజీ ఎంఎల్సీ లెహర్ సింగ్ సిరోయాలు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజస్థాన్లో..
రాజస్థాన్లో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగగా.. మూటింట అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలు ఎన్నికైనట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగిన మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీ విజయం సాధించారు.
మిగిలిన స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్:
4 రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగాయి. ఓటింగ్ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications