మంత్రి రాఖీ కారుపై దాడిలో ట్విస్ట్, కేజ్రీవాల్ అనుమానం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లా కారు పైన ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్న ఘటన వివాదాస్పదమవుతోంది. క్రికెట్ బంతి తగలడం వల్లే కారు అద్దం పగిలి ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు.
అయితే, పోలీసుల అభిప్రాయంతో మంత్రి రాఖీ బిర్లా మాత్రం ఏకీభవించడం లేదు. స్థానిక యువకులు ఆ సమయంలో క్రికెట్ ఆడుతుండగా బంతి వెళ్లి కారుకు తగిలిందని, ఈ మేరకు ఓ యువకుడి కుటుంబ సభ్యులు రాఖీకి క్షమాపణలు కూడా చెప్పారని ఓ టీవీ ఛానల్లో కథనం వచ్చింది. ఈ వార్తను రాఖీ ఖండించారు. ఎవరూ తనకు క్షమాపణ చెప్పలేదన్నారు.

కాగా, రాఖీ బిర్లా కారు పైన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం రోహిణి ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె తన సొంత కారులో బయలుదేరారు.
మంగోల్ పురిలో ఆర్ బ్లాకు వద్ద కారు ఆపి స్థానికులతో మాట్లాడుతుండగా కొందరు దుండగులు హంగామా చేశారని, అందులో ఓ వ్యక్తి పెద్ద రాయితో కారు అద్దాన్ని కొట్టాడని, దీంతో కారు అద్దం పగిలిందని, ఆ సమయంలో రాఖీ కారు ముందు సీట్లో ఉన్నారని, ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని, దాడి తర్వాత వారు పరారయ్యారని ఎఎపి చెబుతోంది. రాఖీ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దాను ఇలాంటి దాడులకు భయపడనని, వ్యక్తిగత భద్రత కోరబోనని ఆమె ఘటన అనంతరం అన్నారు.
బిజెపి లేదా కాంగ్రెస్: కేజ్రీవాల్
రాఖీ కారు పైన దాడి చేసింది బిజెపి లేదా కాంగ్రెసు పార్టీలకు చెందిన వారు అయి ఉంటారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications