భారీ బిల్లు షాక్.. పేదవారికి ఉచితంగా వాదిస్తా: కేజ్రీవాల్కు జెఠ్మలానీ
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోనని, పేదలకు ఉచితంగా వాదిస్తానని లాయర్ రాం జఠ్మలానీ చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోనని, పేదలకు ఉచితంగా వాదిస్తానని లాయర్ రాం జెఠ్మలానీ చెప్పారు.
ఈ కేసులో రూ. 3.86కోట్ల బిల్లును కేజ్రీవాల్కు జెఠ్మలానీ పంపించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ విషయంలో అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేయడంతో కేజ్రీవాల్పై ఆయన పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ తరఫున ప్రముఖ లాయర్ జెఠ్మలానీ వాదిస్తున్నారు.
హెచ్1బీ వీసాలపై ట్రంప్ షాక్: మన ఐటీకి పెద్ద సవాల్
ఈ కేసులో ఇప్పటివరకు వాదించినందుకు జఠ్మలానీ రూ. 3.86 కోట్ల బిల్లును కేజ్రీవాల్కు పంపించారు. కేసు ఒప్పుకున్నందుకు రూ. కోటి, కోర్టులో హాజరైన ప్రతిసారి రూ. 22లక్షల చొప్పున బిల్లు వేశారు.
అయితే ఈ బిల్లును తాను వ్యక్తిగతంగా కట్టలేనని, ప్రభుత్వ ధనాన్ని వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్కు లేఖ రాశారు. దీంతో ఆయన నిపుణుల కమిటీని అడిగి నిర్ణయం తీసుకుంటానన్నారు.
అయితే కేజ్రీవాల్ లేఖ పంపడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తొలుత జెఠ్మలానీ ఎటువంటి ఫీజు తీసుకోనని చెప్పి, ఇప్పుడు బిల్లులు పంపిస్తున్నారని ఏఏపీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో రాం జఠ్మలానీ స్పందించారు. తన ఫీజును ఢిల్లీ ప్రభుత్వం లేదా కేజ్రీవాల్ చెల్లించకపోయినా తాను ఆయన తరఫున వాదిస్తానని తెలిపారు. పేదల కోసం తాను ఉచితంగా వాదిస్తానని, కేజ్రీవాల్ను తన పేద క్లయింట్లలో ఒకరు అనుకుంటానని చెప్పారు.