అంబరీష్పై ఫిర్యాదు: లేదన్న రమ్య, వదలొద్దని డైరెక్టర్
బెంగళూరు/న్యూఢిల్లీ: ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ప్రముఖ నటి, మాజీ ఎంపి రమ్య... తన ఓటమికి మంత్రి అంబరీష్ కారణమని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
రమ్య తన ఫిర్యాదులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ, అంబరీష్ మధ్య ఉన్న మనస్పర్థల వల్ల ఆపార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారని, ముఖ్యంగా అంబరీష్ అనుచరులు ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను ఓడించారని, ఇవన్నీ తెలిసినా అంబరీష్ మౌనంగా ఉన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే, వార్తలను రమ్య ఖండించారు. తాను అంబరీష్ పైన లేదా ఎస్ఎం కృష్ణ పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రమ్య ఈ నెల 19న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. దీంతో ఆమె ఫిర్యాదు చేసినట్లుగా ఊహాగానాలు వచ్చాయి.
కాగా, నటి రమ్య గత ఏడాది ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి మాండ్య నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోను అదే నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ స్వల్ప ఓట్లతో ఆమె ఓడిపోయారు.
రమ్యకు దర్శకుడి సూచన
ప్రముఖ దర్శకులు నాగతిహల్లి.. రమ్యకు సూచనలు చేశారు. సినిమాలను వదలవద్దని సూచించారు. రాజకీయాలను, సినిమాలను బ్యాలన్స్ చేస్తూ వెళ్లాలని రమ్యకు ఆయన హితవు పలికారు.