రేప్ బాధితురాలిని జైల్లో వివాహమాడిన నిందితుడు
భువనేశ్వర్: అత్యాచార బాధితురాలిని నిందితుడు పెళ్లి చేసుకున్న సంఘటన ఒడిషా రాష్ట్రంలో జరిగింది. 32 ఏళ్ల విచారణ ఖైదీ 22 ఏళ్ల అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అధికారులు గురువారం ఈ విషయం చెప్పారు. వారిద్దరి వివాహం బుధవారంనాడు భువనేశ్వర్లోని ఝరపద జైలులో జరిగింది. నిందితుడు ఆ జైలులోనే ఉన్నాడు.
ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, జైలు అధికారులు ఈ వివాహానికి హాజరయ్యారు. స్థానిక కోర్టు ఆదేశాలతో ఆ వివాహం జరిగింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ప్రదీప్ కపూర్ ఓ వార్తాసంస్థకు చెప్పారు.
వృత్తి రీత్యా డ్రైవర్ అయిన నిందితుడు దిలీప్ బహేరా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ శివారులోని గ్రామ సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళకు లిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన నిరుడు జనవరి 23వ తేదీన జరిగింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కొద్ది రోజుల తర్వాత బహేరాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. తామిద్దరు వివాహం చేసుకోవడానికి అనుమతించాలని బాధితురాలు, నిందితుడు కోర్టుకు ఉమ్మడి దరఖాస్తు పెట్టుకున్నారు.
ఇరువురి వాంగ్మూలాలను సేకరించిన కోర్టు వారి వివాహం జరిపించాలని జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు బుధవారంనాడు వివాహం జరిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. నిందితుడిని వదిలేయాలని కోరుతూ బాధితురాలు కోర్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.