ఏయిమ్స్ లో సీల్డ్ బ్రెడ్లో బ్రతికున్న ఎలుక
న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతున్న రోగి బ్రెడ్ తిందామని ప్యాకెట్ విప్పాడు. అంతే అందులో నుంచి బ్రతికి ఉన్న ఎలుక బయటకు దుమికింది. రోగితో పాటు ఆసుపత్రి సిబ్బంది సైతం హడలిపోయారు. సాటి రోగులు ఈ విషయం బయటకు చెప్పకుండా ఏయిమ్స్ అధికారులు జాగ్రతలు తీసుకున్నారు.
దేశంలోనే ప్రసిద్ధి చెందిన న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రిలో ఇంత తతంగం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రముఖ ఎం/ఎస్ బాన్ న్యూట్రియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేసే బ్రెడ్ ను ఏయిమ్స్ ఆసుపత్రిలోని రోగులకు అందిస్తున్నారు.
2015 జులై 29వ తేదీన ఏయిమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి సీల్డ్ బ్రెడ్ అందించారు. ఆ బ్రెడ్ తినడానికి రోగి కవర్ కట్ చేశాడు. అంతే అందులో బ్రతికున్న ఎలుక ఒక్క సారిగా బయటకు దూకేసింది. విషయం తెలుసుకున్న రోగులు షాక్ కు గురైనారు.
మూడు సంవత్సరాల పాటు కంపెనీ ఉత్పత్తుల సరఫరాను నిషేదిస్తున్నామని బాన్ న్యూట్రియెంట్స్ కంపెనీకి సెప్టెంబర్ 24వ తేదిన ఏయిమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే బ్రెడ్ లో నుంచి బ్రతికి ఉన్న ఎలుక బయటకు వచ్చిందని తమ దృష్టికి ఇంత వరకు రాలేదని ఏయిమ్స్ అధికారులు తప్పించుకున్నారు. అదే విధంగా ఆ కంపెనీ ఢిల్లీ డివిజన్ మేనేజర్ సైతం మీడియాకు చిక్కకుండా చిన్నగా జారుకుంటున్నారు. అయితే ఏయిమ్స్ ఇచ్చిన నోటీసులో మాత్రం సీల్డ్ బ్రెడ్ లోకి ఎలుక ఎలా వచ్చింది చెప్పాలని స్పష్టంగా అడిగారు.