అబ్బాయిలూ.. ఇక పెళ్లిళ్లవడం కష్టమే..
న్యూఢిల్లీ : మగపిల్లాడే కావాలనుకునే దంపతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో.. దేశంలో ఆడపిల్లల సగటు గణనీయంగా తగ్గిపోతుండడం కలవరపెడుతోన్న అంశం. ఈ ప్రభావంతో.. దేశంలో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా బయటకొచ్చిన శాంపిల్ రిజిస్ట్రేషన్ లెక్కలను గమనిస్తే.. దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఎంత తేడా ఉందో అర్థమవుతోంది.
2011 13 సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు జన్మిస్తే.. 2012-2014 మధ్య ఈ సంఖ్య మరింత తగ్గి 906కు పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణం. గత లెక్కల ప్రకారం వెయ్యి మంది అబ్బాయిలకు 887 మంది అమ్మాయిలు మాత్రమే పుట్టగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 876 కు తగ్గింది.
ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోను స్త్రీ జననాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 927 అమ్మాయిలు పుట్టగా.. ప్రస్తుతం 921 మంది మాత్రమే ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా చూసుకుంటే.. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 950 మంది అమ్మాయిలు పుడుతుంటే.. దేశంలో మాత్రం పరిస్థితి మారకపోవడం శోచనీయం.