నగదు కొరత, పీఎన్బీ స్కాంపై చర్యలేవీ?: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పై స్థాయీ సంఘం ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ మంగళవారం పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటలపాటు స్థాయీ సంఘం సభ్యులు ఆయనను పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
2016, నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇప్పటివరకు ఎంత నగదు తిరిగొచ్చిందో లెక్కలు చెప్పాలని స్థాయీ సంఘం సభ్యులు ఆయనను ఆదేశించారు. అలాగే, దేశాన్ని కుదిపేసిన పీఎన్బీ కుంభకోణంపైనా ఆయన ప్రశ్నించారు.

ఇన్నేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా ఎందుకు జోక్యం చేసుకోలేదని స్థాయీ సంఘం నిలదీశారు. ఏటీఎంలలో నగదు ఎందుకు సరిగా ఉంచలేకపోతున్నారని ప్రశ్నించారు. నగదు కొరతకు ఎవరు కారణం? అని నిలదీశారు.
ఈ ప్రశ్నలపై స్పందించిన పటేల్ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల నుంచి బయటపడగలమనే విశ్వాసం ఉందని చెప్పారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ను అమలు చేసిన తర్వాత నిరర్థక ఆస్తుల సమస్య విషయంలో పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు.
కాగా, స్థాయీ సంఘం ప్రశ్నలన్నింటికీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తానని ఉర్జిత్ పటేల్ తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తదుపరి సమావేశం జూన్ 19న జరుగుతుంది. ఈ సమావేశంలో ఆర్బీఐ ప్రతినిథి పాల్గొంటారు.












Click it and Unblock the Notifications