పెట్రో మంట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం..?.. ఆర్బీఐ గవర్నర్ దాస్
పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెట్రో ధరల పెంపుపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ధరలు తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్నారు.
పెట్రో ధరల పెంపుతో టూ వీలర్/ కారు వినియోగదారులపై భారం పడుతోంది. దీంతోపాటు ఉత్పత్తి, రవాణాపై కూడా ఎఫెక్ట్ చూపుతోందని శక్తికాంత దాస్ అన్నారు. పన్నులపై కేంద్రం/ రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. పెట్రో ధరల పెంపు వల్ల భారం పడుతోందని చెప్పారు. అసలే కరోనా వైరస్ వల్ల మార్కెట్ ఆశించిన స్థాయిలో లేదని.. ఈ సమయంలో పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
పెట్రో ధరల గురించి కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం/ రాష్ట్రాల చర్చలతో పెట్రో ధరలు తగ్గి వినియోగదారులకు మేలు జరుగుతుందని ఆమె వివరించారు. ఆ తర్వాత శక్తికాంత దాస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.