బీజేపీ నేత వద్ద భారీ డబ్బు.. అన్ని కొత్త నోట్లే.. ఎలా వచ్చాయి?
తమిళనాడుకు చెందిన ఓ బీజేపీ యువనేత వద్ద వద్ద రూ.20.5 లక్షల కొత్తనోట్లు బయటపడ్డాయి.
పుణే : ఓవైపు నోట్లు దొరక్క సామాన్యులంతా అల్లాడుతుంటే.. బడాబాబులకు, రాజకీయ నాయకులకు మాత్రం కాళ్ల దగ్గరికే నోట్లు వచ్చి పడుతున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న ఎన్నో ఘటనలు దీనికి ఊతమిస్తున్నాయి. తాజాగా, బెంగుళూరు, తమిళనాడుల్లో వెలుగుచూసిన ఘటనలను పరిశీలిస్తే.. ఈ అనుమానాలు నిజమే అనిపించకమానదు.
బీజేపీ నేత వద్ద:
తమిళనాడుకు చెందిన ఓ బీజేపీ యువనేత వద్ద వద్ద రూ.20.5 లక్షల కొత్తనోట్లు బయటపడ్డాయి. తనిఖీల్లో భాగంగా.. సేలంకు చెందిన బీజేపీ యువ విభాగం కార్యదర్శి జేవీఆర్ అర్జున్ కారులో ఈ భారీ నగదు బయటపడింది. ఇందులో అన్ని కొత్త నోట్లే ఉండడంతో.. ఇంత భారీ మొత్తంలో డబ్బు అతని వద్దకు ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లక్షకు 20వేల కమిషన్ :
రద్దయిన పాతనోట్లపై దేశవ్యాప్తంగా పెద్ద దందానే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. రూ.20వేల కమిషన్ పై పాతనోట్లకు రూ.80వేల విలువ చేసే కొత్త నోట్లు చెల్లిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా పంజాబ్ లోని బటిండాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బటిండాలోని ఓ బ్యాంక్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న మనీశ్ భత్రీ, క్యాషియర్ గౌరవ్ గార్గ్ ల రూ.లక్ష పాత నోట్లకు రూ.20వేల కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని కొత్త నోట్ల రూపంలో చెల్లించారు.
ఆ నాలుగు ఇళ్లల్లో 6కోట్ల కొత్త నోట్లు :
కర్ణాటక వ్యాప్తంగా ఐటీ శాఖ దాడులు కొనసాగిస్తోంది. నవంబర్ 30నుంచి శుక్రవారం మధ్యాహ్నాం దాకా కొనసాగిన ఈ దాడుల్లో రూ.152కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు, ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్లను, కార్యాలాయాలను తనిఖీ చేయగా.. రూ.6కోట్లకు పైగా నగదు బయటపడింది. ఇందులో 5.7కోట్ల విలువ చేసే డబ్బు కొత్త రూ.2వేల నోట్ల రూపంలోనే ఉండడం గమనార్హం.
బ్యాంకర్లపై ఆరోపణలు :
ఓవైపు బ్యాంకుల సేవలు ఆశాజనకంగా లేవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంటివారు పెదవి విరుస్తుంటే.. దేశవ్యాప్తంగా కొంతమంది వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో కొత్త నోట్లు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. బ్యాంకు అధికారుల సహకారం వల్లే.. ఇలా బడాబాబులకు భారీ మొత్తంలో డబ్బు అందుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.