దెబ్బకు సూపర్ హీరో ఇమేజ్.. అమాంతం పెరిగిన క్రేజ్
ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం వెలుపల తాజాగా వెలిసిన పోస్టర్లు, బ్యానర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కు తెర తీశాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓ నూతన రూపంలో చిత్రీకరిస్తూ వెలిశాయి ఆ పోస్టర్లన్నీ కూడా. ఇప్పుడవి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్నాయి. రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
రాహుల్ గాంధీని హాలీవుడ్ సూపర్ హీరో క్యారెక్టర్ బ్యాట్మ్యాన్ తో పోల్చుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. రియల్ లైఫ్ బ్యాట్మ్యాన్ గా అభివర్ణిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాన్ని కాపాడే ఓ సైలెంట్ గార్డియన్ గా, వాచ్ ఫుల్ ప్రొటెక్టర్ గా ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీని అభివర్ణించారు. రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కూడా హాట్ డిబేట్స్ సాగుతున్నాయి ఈ పోస్టర్ల మీద. యువతతో పాటు ముఖ్యంగా జెన్ జీ ఓటర్లను రాహుల్ గాంధీ విపరీతంగా ఆకట్టుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ ఇంటరాక్టివ్ సెషన్ లో ఈ బ్యాట్మ్యాన్ ప్రస్తావన వచ్చింది. దీని తర్వాతే ఈ పోస్టర్లు వైరల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలే రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ వేదికగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటించేందుకు ఆస్క్ మీ ఎనీథింగ్ అనే డిబేట్ ను ప్రారంభించారు. విద్యార్థుల నిరసనలు, విద్యావ్యవస్థ, దేశ ఆర్థిక విధానాలు, వ్యక్తిగత ఆలోచనల వంటి విభిన్న అంశాలపై సాగిందీ సెషన్.
ఇందులో ఓ ఒక నెటిజన్ "మీరేమైనా బ్యాట్మ్యానా?" అంటూ సరదాగా రాహుల్ గాంధీని ప్రశ్నించాడు. దానికి ఆయన నవ్వుతూ.. "ఈ ప్రపంచంలో నన్ను, బ్యాట్మ్యాన్ను ఇంతవరకు ఎవరూ ఒకే రూమ్ లో చూడలేదు, చూడలేరు కూడా.." అంటూ బదులు ఇచ్చారు. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్లో డార్క్ నైట్ సినిమా థీమ్ మ్యూజిక్తో వర్షంలో నిల్చొని ఉన్న ఓ వీడియో క్లిప్ను కూడా రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ బ్యాట్మ్యాన్ పోలిక నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. ఇది పోస్టర్లకే పరిమితం కాకుండా సమాజంలో నిజంగానే రక్షకుడిగా నిలబడుతున్నారనే సంకేతాలు పంపేలా రాహుల్ గాంధీ ఆందోళనకు దిగుతున్నారు కూడా. జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలో పెల్లెట్ గాయాలపాలైన సాహిల్ లోచాబ్ అనే యువకుడికి న్యాయం చేయాలంటూ ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. బాధితుడి తల్లి, వారి తరఫు న్యాయవాదితో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల రాహుల్ గాంధీ దాదాపు అయిదు గంటల పాటు బైఠాయించారు.
#WATCH | Delhi: Posters describing Lok Sabha LoP and Congress leader Rahul Gandhi as the "real-life Batman" have been put up outside the Congress party headquarters in Delhi pic.twitter.com/USV58cPvZx
— ANI (@ANI) August 23, 2026
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర సీనియర్ పార్టీ నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సీనియర్ అధికారులను కలవడంతో పాటు సుదీర్ఘ పోరాటం చేయడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేశారు. దీంతో రాహుల్ గాంధీ క్రేజ్ అమాంతం పెరిగిందనే వాదనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications