ఆ నలుగురు న్యాయమూర్తులతో సీజేఐ భేటీ, మరో నలుగురు కూడా, ఏం మాట్లాడుకున్నారో?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నలుగురు అసమ్మత సీనియర్ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా గురువారం భేటీ అయ్యారు.
కోర్టు ప్రారంభమవడానికి ముందు జస్టిస్ మిశ్రా.. న్యాయమూర్తులు చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసఫ్తో సమావేశమయ్యారు. దాదాపు అరగంటపాటు ఈ భేటీ జరిగిందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.
గురువారం నాటి సమావేశంలో మరో నలుగురు ఇతర న్యాయమూర్తులు.. ఏకే సిక్రీ, ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, యుయు లలిత్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి బుధవారమే ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. జస్టిస్ చలమేశ్వర్ అస్వస్థతతో సెలవు తీసుకోవడంతో వాయిదా పడింది.
అయితే చలమేశ్వర్ మినహా మిగతా ముగ్గురు న్యాయమూర్తులు రంజన్, కురియన్, మదన్ లోకూర్లతో సీజేఐ నిన్న కొద్దిసేపు భేటీ అయ్యారు. మరి గురువారంనాటి భేటీలో ఏం మాట్లాడుకున్నారన్నదానిపై వివరాలింకా తెలియరాలేదు.
సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదంటూ జనవరి 12న నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. ఈ సందర్భంగా సీజేఏ మిశ్రాపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.