ఆ అరుదైన పాము ఖరీదు రూ.1.25కోట్లు.. ఇలా పట్టేశారు..!
మధ్యప్రదేశ్లోని నర్సింఘర్లో అరుదైన రెడ్ సాండ్ బో పామును విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.25కోట్లు విలువ చేసే ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
నర్సింఘర్ బస్టాండ్ సమీపంలో పాము విక్రయానికి సంబంధించి ఆ ఐదుగురు ఫోన్లో డీల్ మాట్లాడుకుంటుండగా తమ ఇన్ఫార్మర్ గమనించినట్టు చెప్పారు. వెంటనే తమకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని పామును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్ సాండ్ బో పాము విషరహితమైనది. అంతర్జాతీయ మార్కెట్లో మెడిసిన్,కాస్మోటిక్స్ రంగాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాదు,ఈ పాముతో అదృష్టం కూడా కలిసి వస్తుందని చాలామంది నమ్ముతుంటారు.
తమ అంచనా ప్రకారం పాము విలువ రూ.1.25కోట్లు ఉంటుందన్నారు. నిందితులు ఆ పామును సెహోర్ జిల్లా నుంచి పట్టుకున్నట్టు చెప్పారు. నిందితులంతా మైనర్లే అని,వన్యప్రాణ సంరక్షణ చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
అంతేకాకుండా ఇలాంటి పాములు ఇంట్లో ఉంటే శుభసూచకమని, ధనలక్ష్మి వరిస్తుందని కొందరి మూఢ విశ్వాసం. అందుకే ఇలాంటి పాములకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. కొందరి బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి బేరసారాలు జరుగుతుంటాయి అని పోలీసులు మీడియాకు తెలిపారు.