మోడీతో సంబంధంపై రాజ్నాథ్, షూలేస్ కట్టిన జవాన్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. మోడీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తమ మధ్య సంబంధాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి మంచి సంబంధాలు ఉన్నాయో.. భవిష్యత్తులోను అలాగే ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వంలో తన శాఖకు సంబంధించిన వంద రోజుల పాలన గురించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీతో గల సంబంధాల పైన ప్రశ్నించారు. అప్పుడు రాజ్నాథ్ సింగ్ పైవిధంగా స్పందించారు.
నరేంద్ర మోడీ అందరినీ ఆకట్టుకోగల ప్రధాని అని, అతను ప్రధానమంత్రి అయితే, తాను ఆయన మంత్రివర్గంలో పని చేసే మంత్రిని అని వ్యాఖ్యానించారు. తాను హోంమంత్రిని అని చెప్పారు.
వివాదం
హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ జవానుతో తన షూ లేస్ కట్టించుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. రాజ్నాథ్ జమ్ముకాశ్మీర్ పర్యటనలో ఓ జవాను, భద్రతా సిబ్బంది ఒకరు ఆయన షూ లేస్ కడుతున్నట్లుగా ఓ చిత్రం కలకలం రేపుతోంది.