అంబానీ కుటుంబంలో ఒకరిని లేపేస్తాం - పరుగులు తీసిన పోలీసులు
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్ అందింది. కుటుంబంలో ఒకరిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తం ఫోన్ చేశాడు. ఆయన కుటుంబానికి చెందిన సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికీ ఫోన్ చేసి, బెదిరించారు. బాంబులతో ఆసుపత్రిని పేల్చి వేస్తామని హెచ్చరించారు. ఈ రెండు ఘటనలు ముంబై పోలీసులను ఉలిక్కిపడేలా చేశాయి. వారిని పరుగులు పెట్టించాయి.
ముంబై దక్షిణ ప్రాంతంలోని గిర్గావ్, రాజారామ్మోహన్ రాయ్ రోడ్డులో ఉంటుందీ సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్. తొలుత ఈ ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందింది. మొదటి ఫోన్ కాల్ బుధవారం మధ్యాహ్నం 12:57 నిమిషాలకు అందినట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రి ల్యాండ్లైన్ నంబర్కు గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ అందింది. రిసెప్షనిస్ట్ దీన్ని ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఆసుపత్రిని బాంబులతో పేల్చివేస్తామంటూ హెచ్చరించాడు.
ఈ ఫోన్కాల్పై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీబీ మార్గ్ పోలీసులు అజ్ఞాతవ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం 5:04 నిమిషాలకు ముఖేష్ అంబానీ కుటుంబానికీ బెదిరింపు ఫోన్ కాల్ అందింది. ముఖేష్ అంబానీని హతమారుస్తామని బెదిరించారు. ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీల్లో ఒకరికి ప్రాణహాని తలపెడతామని హెచ్చరించారు. అంబానీ నివాసం యాంటిలియాను పేల్చి వేస్తానని బెదిరించాడు.
ఈ రెండు కేసులపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఒకే అయి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. వారికోసం అటు ముంబై పోలీస్ సైబర్ టీమ్ విభాగం కూడా రంగంలోకి దిగింది. అంబానీలకు బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులోనూ ఆయనకు ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనలో ఓ నగల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా యాంటీలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూవీని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పటి అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజె సహా పలువురు అరెస్ట్ అయ్యారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.