రూ.22 కోట్ల నష్టాల్లో రిలయన్స్ జియో! ‘ఉచిత ఆఫర్లు’ కొంపముంచాయా?
ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు భారీ షాకే తగిలింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ ఆరు నెలల వ్యవధిలో రూ.22.50 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.
ముంబై : ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు భారీ షాకే తగిలింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ ఆరు నెలల వ్యవధిలో రూ.22.50 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.
ఏప్రిల్ 1 నుంచి ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పిన కంపెనీ టారిఫ్ ప్లాన్స్ ను అమలుచేస్తోంది. ఏప్రిల్ 1కి ముందు ప్రైమ్ సర్వీసులు యాక్టివేట్ చేసుకున్న వారికి కంపెనీ డేటా ఆఫర్లను కూడా ప్రకటించింది. ధన్ ధనా ధన్ ఆఫర్ పేరుతో ఇటీవలే ఓ కొత్త ఆఫర్ ను కూడా ప్రైమ్ యూజర్లకు తీసుకొచ్చింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చి 31తో ముగిసిన ఆరు నెలల కాలానికి సంబంధించిన ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర నష్టాలను ప్రకటించింది.
గతేడాది ఇదేకాలంలో కంపెనీ నష్టాలు రూ.7.46 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది మరింత పెరిగింది. ఈ ఆరు నెలల వ్యవధిలో మొత్తంగా కంపెనీ ఆదాయం కూడా భారీగా 76 శాతం మేర పడిపోయింది. గతేడాది రూ.2.25 కోట్లుగా ఉన్న ఆదాయం ప్రస్తుతం 54 లక్షలుగా నమోదైంది.
గతేడాదితో పోలిస్తే కంపెనీ వ్యయాలు కూడా భారీగా పెరిగినట్టు వెల్లడైంది. రూ.13.63 కోట్లుగా ఉన్న వ్యయాలు భారీగా ఎగిసి రూ.34.88 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. పన్నులకు ముందు కంపెనీ వ్యయాలు రూ. 34.34 కోట్లు.
తమ 4జీ నెట్ వర్క్ లను విస్తరించడానికి రూ.2 లక్షల కోట్లకు పైగా నగదును ఇన్వెస్ట్ చేయనున్నట్టు కూడా కంపెనీ అంతకముందే చెప్పింది. ఇటీవలే కంపెనీకి 72 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.