జియో మరో సంచలనం : త్వరలో.. కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ సేవలు
రిలయన్స్ జియో త్వరలోనే మరో సంచలనానికి సిద్ధమవుతోంది. త్వరలో బ్రాండ్ బ్యాండ్, కేబుల్ టీవీ సేవలకు జియో శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
ముంబై: ఉచిత ఆఫర్లతో టెలికాం దిగ్గజాలకు గుబులు పుట్టించి కోట్లాది వినియోగదారులను తనవైపు తిప్పుకున్న రిలయన్స్ జియో త్వరలోనే మరో సంచలనానికి సిద్ధమవుతోంది. త్వరలో బ్రాండ్ బ్యాండ్, కేబుల్ టీవీ సేవలకు జియో శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు డీటీహెచ్ రంగంలోకి జియో ప్రవేశించబోతోందని, సెట్ టాప్ బాక్స్ ను ఉచితంగా ఇవ్వబోతోందని.. ఇలా ఇప్పటివరకు వార్తలు వచ్చినా.. తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం జియో డీటీహెచ్ కాకుండా బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ తోపాటు కేబుల్ టీవీ సేవలు కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై ఇప్పటికే పలు వెబ్ సైట్లలో జియో కేబుల్ టీవీ సేవలకు చెందినవిగా పేర్కొంటూ పలు సెట్ టాప్ బాక్సులు ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం కేబుల్ టీవీ సేవలు మాత్రమే కాక బ్రాడ్ బ్యాండ్ ఇటర్నెట్ సేవలను కూడా జియో తన సెట్ టాప్ బాక్స్ ల ద్వారా అందించనుంది.

అందుకే ఆ సెట్ టాప్ బాక్స్ లలో ఇంటర్నెట్ కోసం ఈథర్ నెట్ పోర్టును కూడా అమర్చారు. దాని ద్వారా వైఫై రూటర్ లేదా పీసీకి నేరుగా కనెక్ట్ చేసకుని వినియోగదారులు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను పొందవచ్చు. దీంతోపాటు ఏకకాలంలో కేబుల్ టీవీని కూడా వీక్షించవచ్చు.
ఈ ఏడాది ఆఖరుకల్లా...
కేబుల్ టీవీ, బ్రాడ్ బ్యాండ్ సేవలను ఈ ఏడాది ఆఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా వంటి మెట్రో నగరాలతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దేశంలోని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించాలని భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కేబుల్ టీవీ, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవల గురించి జియో నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.












Click it and Unblock the Notifications