కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్- ఆ పథకంలో 4 శాతం రిజర్వేషన్
Central Government Housing Schemes: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే గృహ నిర్మాణ పథకంలో వారికి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది.
ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రధాని మోదీ విజన్.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్లో బాగంగా తమ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. సుగమ్య భారత్ అభియాన్ లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

గృహ నిర్మాణ పథకంలో దివ్యాంగులకు నాలుగు శాతం మేర రిజర్వేషన్లను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణలు సైతం చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం- 2016ను ఈ మేరకు సవరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న హౌసింగ్ పథకంలో హాస్టళ్లతో సహా టైప్- 5 వరకు అందుబాటులో ఉన్న ఖాళీల్లో దివ్యాంగులకు నాలుగు శాతం మేర రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుంది. ఈ నాలుగు శాతం రిజర్వేషన్ కింద గృహ కేటాయింపు ప్రతి నెలా ఇ-సంపద వెబ్సైట్లో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా చేపడతారు.
ఆటోమేటెడ్ సిస్టమ్ ఆఫ్ అలాట్మెంట్ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న దరఖాస్తుదారులు తమ ప్రొఫైల్లో యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు నంబర్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డునూ అందులో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఈకేవైసీ ప్రక్రియను వికలాంగులకు కూడా అందుబాటులో తీసుకుని రావాలంటూ ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితులు, అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వాళ్లు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ పై ఈ తీర్పు వెలువడింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం డిజిటల్ యాక్సెస్ లో జీవించే హక్కు దేశ ప్రజలందరికీ ఉంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications