ఆర్థిక వ్యవస్థకు రూ.3లక్షల కోట్లు: నోట్ల రద్దుపై వెంకయ్య
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అనేది ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్ణయం వల్ల వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు రూ.3లక్షల కోట్ల పైగా వెసులుబాటు కలుగుతుందని వెంకయ్య వెల్లడించారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
నల్లధనం అరికట్టడంవల్ల ద్రవ్యలోటు తగ్గుతుందని, ధరలు తగ్గుతాయని ఆయన విశ్లేషించారు. అంతేగాక, అంత భారీ మొత్తం డబ్బు పేదల సంక్షేమానికి ఖర్చుపెట్టడానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధాని నిర్ణయాన్ని ఐఎంఎఫ్తోపాటు అంతర్జాతీయ క్రెడిట్రేటింగ్ సంస్థలు స్వాగతిస్తున్నాయని తెలిపారు.
దేశంలో 82వేల బ్యాంకు శాఖలు, 2.20లక్షల ఏటీఎంలకు ముందే సమాచారం తెలియజేస్తే గోప్యత దెబ్బతింటుందన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి కేబినెట్లో నిర్ణయం తీసుకొని ప్రధాని బహిరంగ ప్రకటన చేశారని చెప్పారు. సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశాన్ని తప్పుబట్టే విధంగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి బెదిరింపులకు మోడీ భయపడరని వెంకయ్య స్పష్టం చేశారు.
తాజా నిర్ణయంవల్ల అంతిమంగా పేదలే లబ్ధిపొందుతారని చెప్పారు. కొంతమంది దగ్గర విశేషంగా డబ్బు పోగుపడిందన్నారు. దానివల్ల అసమానతలు పెరిగి వ్యవస్థను దెబ్బతీస్తోందని చెప్పారు.
'కొద్దిమంది అవినీతి వల్ల సామాన్యుడికి నష్టం జరుగుతోందనే ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకొంది. పార్లమెంటులో దీనిపై చర్చ జరగడం ప్రభుత్వానికే మేలు. ఎవరు ఎటువైపు నిలబడుతున్నారో ప్రజలకు తెలిసిపోతుంది. అవినీతిపరులవైపా? సామాన్యుడివైపా? అన్నది పార్టీలు నిర్ణయించుకోవాల్సిన సమయం సమయం ఆసన్నమైంది' అని అన్నారు.
పాక్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల విషయంలోనూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్నారు. ఇప్పుడూ అదే విధంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. 'ఒకనోటు ముద్రణ పూర్తి అయ్యి బయటికి రావాలంటే 21 రోజులు పడుతుంది. అది ముద్రణ కేంద్రాలనుంచి బ్యాంకులకు చేరడానికి 21 రోజులు పడుతుంది. ఇప్పుడు ఆ సమయాన్ని తగ్గించడానికి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా తరలించాలని మోడీ ఆదేశించారు' అని చెప్పారు.
'ప్రభుత్వం ఉదాత్తమైన లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నానికి ప్రజలంతా సహకరిస్తున్నారు. ప్రసవవేదన అనుభవించేటప్పుడు తల్లికి బాధగానే ఉంటుంది. కానీ పుట్టిన పిల్లలను చూసి మాతృమూర్తి సంతోషపడినట్లే భవిష్యత్తులో మేలును చూసి ప్రజలు సంతోషపడతారు. వ్యవస్థ కుదుటపడి ధరలు తగ్గినప్పుడు పేదలు సంతోషిస్తారు. గతంలో విప్లవాత్మక చర్యగా ప్రచారం చేసిన రాజభరణాల రద్దు వల్ల రూ.10 కోట్లే మేలు జరిగింది. బ్యాంకులు జాతీయం చేసినప్పుడూ సామాన్యుడికి ఏమీ రాలేదు. ఇక్కడ మాత్రం సామాన్య జనం లబ్ధిపొందబోతున్నారు' అని వెంకయ్య వివరించారు.
డిసెంబర్ 30వరకు పాతనోట్ల చలామణీ కొనసాగించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి కదా? అని ప్రశ్నించినప్పుడు 'వాళ్లు ఖర్చుపెట్టుకోవడానికి?ప్రజలకోసమా?' అని చురకలు అంటించారు. దేశాన్ని పీడిస్తున్న సుమారు రూ. 20 లక్షల కోట్ల నల్లధనం, నకిలీ కరెన్సీ మోడీ నిర్ణయంతో చిత్తుకాగితాల్లా మారిపోయాయని అన్నారు.