వాకింగ్ వెళ్లిన ఆర్జేడీ నేతను కాల్చి చంపేశారు
పాట్నా: ఆర్జేడీ నేతను అతి దారుణంగా తుపాకితో కాల్చి హత్య చేసిన సంఘటన బీహార్ లో జరిగింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయనను వెంటాడిన ప్రత్యర్థులు కాల్చి చంపి దర్జాగా వెళ్లిపోయారు.
బీహార్ రాజధాని పాట్నాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్ పూర్ జిల్లా నౌగచియాలో ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ (50) నివాసం ఉంటున్నారు. ఈయన నౌగచియా నగర్ పంచాయితీ సభ్యుడు.
శనివారం ఉదయం వినోద్ యాదవ్ వాకింగ్ కు వెళ్లారు. వెనుక నుంచి బైక్ లో వెళ్లిన ముగ్గురు నిందితులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన వినోద్ యాదవ్ అక్కడే మరణించారని భాగల్ పూర్ జిల్లా ఆర్జేడీ అధ్యక్షుడు తిరుపతి నాథ్ తెలిపారు.

వినోద్ యాదవ్ హత్యకు గురైన ఘటనాస్థలంలో ఓ తుపాకి, నాలుగు ఖాళీ తూటాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ పంకజ్ సిన్హా చెప్పారు. వ్యకిగత కారణాల వలన శత్రువులు వినోద్ యాదవ్ ను హత్య చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
వినోద్ యాదవ్ మీద 22 క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. వినోద్ యాదవ్ మేనల్లుడు అజిత్ యాదవ్ ఈ హత్య చేసి ఉంటాడని వినోద్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని నగౌచియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications