రూ.500 నోట్లతో జాగ్రత్త: కరెన్సీ పై ఇవి కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురండి
పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ దొరకడమే కష్టమైపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. అప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈనోట్లు దొరకడం కూడా కష్టమైపోయింది. క్రమంగా నోట్ల రద్దు ప్రభావం తగ్గిపోయింది. విరివిగానే రూ. 500, రూ.2000 నోట్లు దొరుకుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దొంగనోట్లు కూడా ఎక్కువే మార్కెట్లో కనిపించాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది.
ప్రస్తుతం లభిస్తున్న రూ. 500 నోట్లపై ఇటు బ్యాంక్ అధికారుల్లో అటు ప్రజల్లో పెద్ద మీమాంస నెలకొంది. రూ. 500 నోటు తీసుకోవాలంటే జంకుతున్నారు. ఇందుకు కారణం ఆ నోటు అసలు నోటా లేక నకిలీ నోటా అనేది తేల్చుకోలేకున్నారు. ఇలాంటి నోట్లే కొన్ని వెలుగు చూశాయి. రూ.500 నోటు వెనక ఇంగ్లీషులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంటుంది. అందులో అక్షర దోషాలు ఉండటంతో అసలు నోటు నిజమా కాదా అనే అనుమానం కలుగుతోంది ప్రజలకు. ఇలా ఒక్కటి కాదు కొన్ని రూ.500 నోట్ల కట్టల్లో ఇదే తప్పిదం దర్శనమిస్తోంది. ఇదే ఇటు బ్యాంక్ అధికారులను అటు ప్రజలను కన్ఫ్యూజన్లోకి నెట్టేసింది.
ఈ కన్ఫ్యూజన్ నుంచి ప్రజలను బ్యాంక్ అధికారులను కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే గట్టెక్కించగలదు. ప్రింటింగ్ పొరపాటా లేక ఇవి తాము విడుదల చేసిన నోట్లు కాదని స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ పై ఉందని బ్యాంక్ అధికారులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు రూ. 500 నోట్లు తీసుకుంటున్నప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని బ్యాంకు ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఏటీఎంలలో క్యాష్ నింపే అధికారులను కూడా అలర్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు రూ.2వేల నోట్లకు సంబంధించి దొంగనోట్లను గతేడాది భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నాయి.