ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలనం: మసీదుకు భగవత్!
లక్నో: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆలయాలను సందర్శించడం సాధారణమే. కానీ, ఈసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి మసీదును సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
లక్నోలో కొత్తగా నిర్మించిన మసీదుకు ఆయన వెళ్లనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ లా బోర్డ్(ఏఐఎంపీడబ్ల్యూ ఎల్బీ) ఛైర్ పర్సన్ షైస్తా అంబర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు మోహన్ భగవత్.
మోహన్ లాల్ గంజ్లోని మాధో ఆశ్రమంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన భగవత్ను అంబర్ కలిశారు. 'మాధో ఆశ్రమానికి సమీపంలో నేను నిర్మించిన మసీదును సందర్శించాలని భాగవత్ ను ఆహ్వానించాను. ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదుకు వస్తానని ఆయన నాకు హామీయిచ్చార'ని అంబర్ తెలిపారు.
భగవత్ మసీదును సందర్శిస్తే ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమనే భావన సమసిపోతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం, సామాజిక విషయాల గురించి కూడా భగవత్ తో చర్చించినట్టు చెప్పారు. కాగా, భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని బలవంతం చేయించడం సరికాదని ఇటీవల భగవత్ పేర్కొనడం గమనార్హం.
జై భారత్ అనని మదర్సా విద్యార్థులపై దాడి
దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు మదర్సా విద్యార్థులపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్ మాతా కీ జై అని నినదించనందుకు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా మదర్సాలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల ఓ పార్కుకు వెళ్లారు. కొంతసేపటికి కొందరు వ్యక్తులు తమ వద్దకు వచ్చి దాడి చేశారని బాధితుల్లో ఒకడైన మహ్మద్ దిల్కాష్ చెబుతున్నాడు. తన టోపీ లాగేసుకుని, తీవ్రంగా కొట్టారని చెప్పాడు.
జై మాతా, భారత్ మాతా కీ జై అని చెప్పాలని.. లేదంటే తమను చంపేస్తామని బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. అయితే ఆ యువకులంతా ఒకరికొకరు పరిచయస్తులేనని, ఘటనకు ముందు వారంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.
జై మాతా నినాదాలు చేయలేదని తమపై దాడి చేసినట్లు యువకులు ముందు ఆరోపించారని పోలీసులు తెలిపారు. అనంతరం మాట మార్చి భారత్ మాతా కీ జై అని నినదించమన్నారని ఫిర్యాదు చేశారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.