కేజ్రీవాల్తో జాగ్రత్త: బిజెపికి మోహన్ భగవత్ హెచ్చరిక
హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విసిరిన సవాల్ను సీరియస్గా తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు మోహన్ భగవత్ భారతీయ జనతా పార్టీకి సూచించారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యవహరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని బిజెపి నేతలకు ఆయన సూచించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ ఇవ్వడంలో బిజెపి అనుసరిస్తున్న విధానాలపై కూడా మోహన్ భగవత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సమావేశానికి హాజరైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కూడా ఆయన ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. మూడు రోజుల నుంచి జరుగుతున్న అఖిల భారత కార్యదర్శుల సమావేశాల చివరి రోజు కావడంతో గురువారం ఆయన హాజరయ్యారు.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ జోషి, బిజెపి నాయకులు నితిన్ గడ్కరీ, రాంలాల్, భయ్యాజీ జోషి, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబివిపి), విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకులతోపాటు ఇతర పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలు, ఇతర సంబంధిత వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు.