ఈ సాయంత్రం తెరచుకోనున్న శబరిమల ఆలయం తలుపులు: అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్
కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు.. కన్ని మాస పూజల కోసం ఈ సాయంత్రం తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 5: 30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు మేల్శాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి, ప్రధాన తంత్రి బ్రహ్మదత్తన్ సమక్షంలో గర్భగుడి తలుపులను శాస్త్రోక్తంగా తెరిచి దీపారాధన చేయనున్నారు. అనంతరం సన్నిధానంలోని ఆళి వద్ద అగ్ని ప్రజ్వలనం చేస్తారు. గురువారం తెల్లవారు జాము నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.
కన్ని మాస పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 21వ తేదీ రాత్రి 10 గంటలకు హరిహరసుతుని ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. ఈ అయిదు రోజుల పాటు శబరిమల సన్నిధానంలో నెయ్యాభిషేకం, కలశాభిషేకం, పడిపూజ, ఉదయాస్తమయ పూజల వంటి విశేష అర్చనలను అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమబద్ధంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.

శబరిమల క్షేత్ర యాత్రను భక్తులకు మరింత సులభతరం చేయడానికి టీడీపీ ఆన్లైన్ వర్చువల్ క్యూ విధానాన్ని ఈసారి కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆలయ దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి తలెత్తకుండా భక్తులు sabarimalaonline.org అనే అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దర్శనం స్లాట్లను ముందే బుక్ చేసుకోవచ్చు. ఈ కన్ని మాస పూజలకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కూడా.
సన్నిధానంలో దర్శనానికి వచ్చే దేశీయ భక్తులు రాత్రి సమయాల్లో బస చేయడానికి వీలుగా దేవస్వం బోర్డు గెస్ట్ హౌస్లు, పిలిగ్రిమ్ సెంటర్లలో వందలాది గదులను కేటాయించింది. వీటిని కూడా ఆన్లైన్ ద్వారానే త్వరితగతిన బుక్ చేసుకునే ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంది. దీనికోసం భక్తులు 'onlinetdb.com' వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
కేరళ సంప్రదాయాలు, హిందూ ఆచారాల ప్రకారం కన్ని మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ అయిదు రోజుల పాటు శబరిమల కొండపై ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో 18 బంగారు మెట్ల వద్ద నిర్వహించే పడి పూజ.. ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన ముగిసిన అనంతరం స్వామివారి సన్నిధిలో అష్టాభిషేకాలు, పడి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
కన్ని మాసంలో వచ్చే సర్ప పూజలకు కూడా హిందూ ధర్మంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర రోజుల్లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, భక్తుల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని విశ్వసిస్తారు.













Click it and Unblock the Notifications
