సచిన్ ‘భారతరత్న’కు అనర్హుడు -కొడుకు ఐపీఎల్ ఎంట్రీ కోసమే -కాంగ్రెస్ సంచలనం -పవార్ కూడా
సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది రైతలు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 74వ రోజుకు చేరాయి. అగ్రి చట్టాలు అందరికీ మేలు చేసేవేనని ప్రభుత్వం వాదిస్తుండగా, వాటిని రద్దు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘాలు భీష్మించుకున్నాయి. ఈక్రమంలో రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం, వాటిని భారత ప్రభుత్వం తిప్పికొట్టడం, సర్కారుకు మద్దతుగా దేశంలోని ప్రముఖులంతా ట్వీట్లు చేసిన దరిమిలా, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అందరికీ టార్గెట్ అయ్యారు..
సచిన్ ఆ పురస్కారానికి అనర్హుడు..
వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ రిహానా(రియానా), పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ సహా పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు.. ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలపై ట్వీట్లు చేయడాన్ని ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేయడం, సర్కారును సమర్థిస్తూ, రైతుల ఉద్యమం దేశ అంతరంగిక అంశమంటై సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్ సహా పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం తెలిసిందే.
కాగా, గడిచిన రెండున్నర నెలలుగా ఉద్యమిస్తోన్న రైతులను పట్టించుకోకుండా, మోదీ సర్కారుకు అనుకూలంగా సచిన్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఇప్పటికే సచిన్ పై సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురుస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ తొలిసారిగా క్రికెటర్ 'భారతరత్న' పురస్కారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అవార్డుకు సచిన్ అనర్హుడని పేర్కొన్నారు..
కొడుకు కోసమే తాపత్రయం..
పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ గిల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సచిన్ ను ఉద్దేశించి సంచలన విమర్శలు, ఆరోపణలు చేశారు. ''సచిన్ టెండూల్కర్ భారతరత్న పురస్కారానికి అర్హుడు కాదు. వ్యక్తిగత ప్రతిఫలం కోసమే ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్ చేశారు. తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్లో ఎంపిక చేసుకోవాలన్న తాపత్రయంతోనే ఆయన రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వ్యక్తి భారతరత్నగా ఉండటానికి అనర్హుడని నేను భావిస్తున్నాను. దీనిపై ఎలా స్పందిస్తారో ప్రజలకే వదిలేస్తున్నా..'' అని కాంగ్రెస్ ఎంపీ గిల్ వ్యాఖ్యానించారు. అంతకుముందు..
హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు
శరద్ పవార్, రాజ్ థాక్రే సూచనలు..
పాప్ స్టార్ రిహానా ట్వీట్ కు కౌంటరిచ్చే క్రమంలో సచిన్ సహా దేశీ సెలబ్రిటీలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న క్రమంలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం స్పందించారు. క్రికెట్ కాకుండా ఇతర అంశాలపై మాట్లాడేముందు సచిన్ వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని పవార్ చురకలు అంటించారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ పవార్ ఈ కామెంట్లు చేశారు. ఈ అంశంపై మహారాష్ట్ర నవనిర్మాణ్ (ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ రాజ్ఠాక్రే అనూహ్య వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ లాంటివాళ్లు నిజమైన లెజెండ్స్ అని, కేంద్రంలోని మోదీ సర్కారు తన ప్రతిష్ట కోసం ఇలాంటి లెజెండ్స్ తో తప్పుడు ప్రకటనలు చేయిస్తుండటం గర్హనీయమని ఠాక్రే అన్నారు. కాగా
సచిన్కు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ..
రైతుల నిరసనలు తీవ్రతరమైన క్రమంలో సెలబ్రిటీల ట్వీట్ల వివాదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ పంజాబ్ కు చెందిన ఆ పార్టీ ఎంపీ జస్బీర్ గిల్ మాత్రం ఇవాళ తొలిసారి సచిన్ భారతరత్నకు అర్హుడు కాబోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి 2014లో సచిన్ పేరును భారతరత్న పురస్కారానికి నామినేట్ చేసిందే కాంగ్రెస్(యూపీఏ) ప్రభుత్వం.
రాష్ట్రపతి కోటాలో క్రికెటర్ ను రాజ్యసభకు పంపింది కూడా యూపీఏ హయాంలోనే. అలాంటిది ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ.. సచిన్ భారతరత్నకు అనర్హుడని విమర్శించడాన్ని ప్రత్యర్థులు తప్పుపడుతున్నారు. భారత్ లో క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే బీసీసీఐకి కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా సారధ్యం వహిస్తున్న నేపథ్యంలోనే క్రికెటర్లు ట్వీట్లు చేశారనే వాదన వినిపిస్తోంది. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలను బహిష్కరించాలని కూడా కాంగ్రెస్ ఎంపీ గిల్ పిలుపునిచ్చారు.