ఆమ్ ఆద్మీని దెబ్బకొట్టిన హైప్రొఫైల్ మర్డర్: ముఖ్యమంత్రి కంచుకోటలో దారుణ ఓటమి: కారణాలివే
చండీగఢ్: ఏపీ సహా దేశవ్యాప్తంగా మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మూడు లోక్సభ స్థానాల్లో ఉత్తర ప్రదేశ్లోని ఆజంగఢ్ మినహా రామ్పూర్, పంజాబ్లోని సంగ్రూర్ ఫలితాలు వెలువడ్డాయి. రామ్పూర్ను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఘన్శ్యామ్ లోధి ఘన విజయం సాధించారు. ఆజంగఢ్లోనూ బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ నిర్హువా ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఆశ్చర్యపరిచిన సంగ్రూర్ సంగ్రామం
మిగిలిన రెండింటి మాటెలా ఉన్నప్పటికీ- సంగ్రూర్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితం మాత్రం ఆశ్చర్యపరిచింది. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఓడిపోయారు. 6,070 ఓట్ల తేడాతో మట్టి కరిచారు. ఆప్ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్పై శిరోమణి అకాలీదళ్ చీఫ్ సిమర్జిత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ ఏ దశలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చారే తప్ప ఆధిక్యతను కనపర్చలేకపోయారు.

ముఖ్యమంత్రి కంచుకోట..
సంగ్రూర్ నియోజకవర్గం.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు కంచుకోట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం వీచిన గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ భగవంత్ మాన్పై పోటీ చేసి, డిపాజిట్లు తెచ్చుకోలేకపోయిన సిమర్జిత్ సింగ్ మాన్.. ఈ సారి గెలుపొందారు. పైగా- భగవంత్ మాన్ రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన లోక్సభ స్థానాన్ని ఆమ్ ఆద్మీ కోల్పోవాల్సి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నాలుగు నెలలకే వ్యతిరేకతా?
నిజానికి- పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఎన్నో రోజులు కాలేదు. ఈ ఏడాది మార్చిలోనే భగవంత్ మాన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నాలుగు నెలల వ్యవధిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందనడానికి సంగ్రూర్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు విశ్లేషకులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ పరిధిలోని తొమ్మిది స్థానాలనూ ఆప్ గెలుచుకుంది. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని, ఫలితంగా పార్టీ ఓడిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

దెబ్బకొట్టిన మూసేవాలా మర్డర్
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యోదంతం.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణమైందనే వాదనలు ఉన్నాయి. మూసేవాలా సహ పలువురు ప్రముఖులకు వ్యక్తిగత భద్రతను తొలగించిన వెంటనే మూసేవాలా హత్యకు గురి కావడం పంజాబీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వ్యక్తిగత భద్రతను తొలగించడం వల్లే ఆన హత్యకు గురయ్యారని, ఇది ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అనాలోచిత చర్య అంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్టే.

బలహీన అభ్యర్థి..
ఆప్ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్ బలహీనమైన అభ్యర్థిగా భావిస్తున్నారు విశ్లేషకులు. సిమర్జిత్ సింగ్ మాన్ వంటి సీనియర్పై పోటీ పెట్టదగ్గ అభ్యర్థి కాదనే వాదన కూడా ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఘరాచొన్ గ్రామ సర్పంచ్ గుర్మెయిల్ సింగ్. భగవంత్ మాన్కు కుడిభుజంగా చెబుతుంటారు. ఆ పేరుతో ఆయన కొన్ని అక్రమాలకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఎదురుగాలి వీస్తోందనే విషయం తెలుసుకున్న వెంటనే భగవంత్ మాన్ రెండు రోజుల పాటు సంగ్రూర్లో మకాం వేసినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేయిదాటిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications