ఉత్తరప్రదేశ్- గోవా అసెంబ్లీ బరిలో శివసేన : ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే : సంజయ్ క్లారిటీ..!!
బీజేపీ కు మరో జలక్ ఇచ్చేందుకు శివసేన సిద్దమవుతోంది. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యం గా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలకు వ్యక్తిగత ప్రతిష్ఠాత్మక అంశంగా మారుతోంది. ఈ సమయంలో శివనసేన నేత..ఎంపీ సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేసారు. రాబోయే ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని స్పష్టం చేసారు.

యూపీలో రైతుల మద్దతు- గోవాలో ఐక్య పోరాటం
పశ్చిమ యూపీలో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. యూపీలో మొత్తం 403 మంది నియోజకవర్గాలుండగా.. సేన 80-100 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతుందని, 40 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్న గోవాలో 20 చోట్ల చేయనున్నట్లు పేర్కొన్నారు. 019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి పంచుకునే విషయంలో శివసేన మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ -ఎన్సీపి తో కలిసి ప్రభుత్వం కొనసాగిస్తోంది.

బీజేపీని దెబ్బ తీసే ఎత్తుగడా
ఆ సమయం నుంచి బీజేపీతో విభేదిస్తూనే ఉంది. అయితే, ఉత్తర ప్రదేశ్ లో పూర్తి మత -కుల విభజన ఆధారంగా ఓట్ల చీలక పైనే అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పుడు శివసేన బరిలో దిగితే అది ఎంతో కొంత బీజేపీ ఓట్ బ్యాంక్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన..ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో పొత్తుతో పోటీ చేస్తుందా..లేక, ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

గుజరాత్ అంశం బీజేపీ అంతర్గత వ్యవహారం
సంజయ్ రౌత్ తాము బరిలోకి దిగుతున్న విషయం చెబుతూ.. పశ్చిమ యూపీలోని రైతు సంస్థలు శివసేనకు మద్దతు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశాయని, అలాగే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చన్నారు. గోవాలోనూ 'మహావికాస్ అఘాడి' ఫార్ములా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శివసేనకు క్యాడర్ ఉందని, విజయం.. ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంతి విజయ్ రూపానీ రాజీనామా అంశం.. బీజేపీ అంతర్గత వ్యవహారమని... బయటి వ్యక్తులు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని రౌత్ పేర్కొన్నారు.

శివసేన పోటీకి ఎవరికి నష్టం..ఎవరికి లాభం
జాతీయ స్థాయిలో మహారాష్ట్ర సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పాత్ర'పై ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఠాక్రేకు ఆ సామర్థ్యం ఉందని.. మహారాష్ట్ర సీఎం జాతీయ నాయకుడని అన్నారు. ఇక, ఇప్పుడు గోవాలో తాము 'మహావికాస్ అఘాడి ఫార్ములా అమలు చేస్తామని స్పష్టత ఇచ్చిన సంజయ్ రౌత్..ఉత్తర ప్రదేశ్ లో మాత్రం అది సాధ్యం అవుతుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక, శివసేన నిర్ణయం పైన అటు బీజేపీ ..ఇటు కాంగ్రెస్ తో సహీ స్థానికంగా కీలకమైన ఎస్పీ..బీఎస్పీ..ఎంఐఎం ఏ రకంగా స్పందిస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications