జయ వెంట ఆస్పత్రిలోనే శశికళ: కేంద్రమంత్రి రాధాకృష్ణన్ ఆరా
చెన్నై: గుండెపోటు కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె సన్నిహితురాలు శశికళ, సీఎం సలహాదారు షీలా బాలకృష్ణన్ ఆస్పత్రిలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కాగా, ఎలాంటి వదంతులు నమ్మవద్దని తమిళ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. తమిళనాడు చీఫ్ సెక్రటరీ రాంమోహన్రావు ఆస్పత్రికి, సచివాలయానికి తిరుగుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.
ఆస్పత్రిలో జయ ఆరోగ్యంపై ఆరాతీసిన కేంద్రమంత్రి
చెన్నై అపోలో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్రమంత్రి రాధాకృష్ణన్.. వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా రాధాకృష్ణన్ తెలిపారు.
జయ ఆరోగ్యం విషమమే
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కొందరంటుంటే... అమ్మ విషయంలో భయపడాల్సిందేమీ లేదని మరికొందరు చెబుతున్నారు.
అపోలో ఆస్పత్రి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జయలలిత ఆరోగ్యం ఆదివారం సాయంత్రం విషమించిన మాట వాస్తవమేనని కానీ ఈ ఉదయం ఆమెకు హార్ట్ సర్జరీ చేసినట్లు తెలిసింది. సోమవారం ఉదయం యాంజియోగ్రామ్ విధానం ద్వారా చికిత్సంనందించారని పార్టీ మహిళా నేత సీఆర్ సరస్వతి తెలిపారు. భయపడాల్సిందేమీ లేదని, అమ్మ ఆరోగ్యంగానే ఉందని వైద్యులు భరోసానిచ్చారని ఆమె చెప్పారు. అయితే డాక్టర్లు అధికారికంగా ఏ విషయం ప్రకటించేదాకా ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన తగ్గేలా లేదు.
ప్రమాదం లేదు
ఎయిమ్స్ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రికి వైద్యులను పంపించామని, సీఎం జయలలిత ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. ఇది ఇలా ఉండగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చెన్నైలో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా కాన్సులేట్ ప్రకటించింది.