క్రిమినల్ కేసుల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్ ! కేసుల్ని తేల్చేందుకు హైకోర్టుల్లో స్పెషల్ బెంచ్
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఇవాళ భారీ షాకిచ్చింది. వీరిపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ అంతకంతకూ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. వీటిని వేగవంతం చేసేందుకు వీలుగా హైకోర్టులో స్పెషల్ బెంచ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణను ఇవి పర్యవేక్షించాలని తెలిపింది.
ప్రతీ హైకోర్టు తమ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణను నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ఈ ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుల ఛీఫ్ జస్టిస్ లకు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణలు వేగవంతం చేయాలని కోరుతూ దాఖలై పిటిషన్లో కోర్టు సహాయకుడిగా ఉన్న విజయ్ హన్సారియా, పిటిషనర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ 40 శాతం మంది ఇలాంటి వారు ఉన్నారని తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం జిల్లాల న్యాయవ్యవస్థపై హైకోర్టులకు ఇప్పటికే పర్యవేక్షణ అధికారం ఉన్నందున ప్రతి కేసు స్థితిని సులభంగా పర్యవేక్షించగలదని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. కాబట్టి తమ పరిధిలో ఉన్న ఇలాంటి వ్యవహారాలపై సుమోటో కేసులు నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు. ఈ కేసుల్ని విచారించే స్పెషల్ బెంచ్ లలో ప్రతి హైకోర్టు ప్రత్యేక బెంచ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో లేదా ప్రధాన న్యాయమూర్తిచే నియమించబడిన న్యాయమూర్తులను కలిగి ఉండవచ్చన్నారు.
పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక నిర్దేశిత కోర్టులకు కేసులను కేటాయించే బాధ్యతను హైకోర్టులు ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తులకు అప్పగించాలని కూడా సీజేఐ ఆదేశించారు. ఇలా నియమించిన ట్రయల్ కోర్టులు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆపై ఐదేళ్ల జైలుశిక్ష, ఇతర ఆరోపణలకు తక్కువ శిక్ష విధించాలన్నారు. అరుదైన లేదా బలవంతపు పరిస్థితుల్లో తప్ప కోర్టులు ఎలాంటి వాయిదాలను అనుమతించకూడదన్నారు.












Click it and Unblock the Notifications