విపక్షాలకు సుప్రీంకోర్టు భారీ షాక్-ఈడీ, సీబీఐల దుర్వినియోగం పిటిషన్ విచారణకు నిరాకరణ..
దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర దర్యాప్తు సంస్ధల్ని విపక్షాలను టార్గెట్ చేసేందుకు వాడుకోకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆభ్యర్ధించాయి. అయితే దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో విపక్షాలు తమ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నాయి.
ఈడీ, సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ కాంగ్రెస్ సహా 14 విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ పై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రాధమిక విచారణ జరిపింది. 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో 95 శాతం విపక్ష నేతలపైనే ఉన్నాయని విపక్షాల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించింది.

ఈ ఉమ్మడి పిటిషన్పై కాంగ్రెస్తో పాటు డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), జేఎంఎం, జేడీ(యూ), సీపీఐ(ఎం), సీపీఐ, సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ సంతకాలు చేశాయి. ఈ పిటిషన్ పై ప్రాధమిక విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం.. దీనిపై తదుపరి విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టు సూచన మేరకు విపక్షాలు ఈ పిటిషన్ ను ఉపసంహరించుకున్నాయి.

దేశవ్యాప్తంగా విపక్షాలను టార్గెట్ చేస్తూ సీబీఐ, ఈడీ నమోదు చేస్తున్న కేసులపై పలు పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. వీరంతా ఏకమై ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. అయితే రాజకీయ కారణాలతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టు భావించినట్లు తెలుస్తోంది. దీంతో మీ వివాదాల్లోకి న్యాయస్ధానాలను లాగొద్దని పరోక్షంగా విపక్షాలకు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ పిటిషన్ ను విపక్షాలు వెనక్కి తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications