స్కూళ్ల రీఓపెనింగ్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు... ఆ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థికి చురకలు...
స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్కూళ్లను తెరవాలా వద్దా అనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని... కాబట్టి అన్ని రాష్ట్రాలను ఒకేలా చూసే పరిస్థితి లేదని తెలిపింది. స్కూళ్ల రీఓపెనింగ్కు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని 12వ తరగతి విద్యార్థి ఒకరు పిటిషన్ దాఖలు చేయగా... జస్టిస్ డీవై చంద్రచూడ్,జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది.
పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థికి సుప్రీం కోర్టు చురకలంటించింది. ఇలా కోర్టుల్లో పిటిషన్స్ వేయడం కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించింది. 'ఆ చిన్నారిని చదువుపై ఫోకస్ చేయమనండి... ఇలా పిటిషన్లు దాఖలు చేయడంపై కాకుండా... ఇదేమీ పబ్లిసిటీ జిమ్మిక్కు అనడం లేదు... కానీ పిటిషనర్ కోరిన రిలీఫ్ సరైనదిగా లేదు...' అని బెంచ్ పేర్కొంది. పిల్లలందరినీ స్కూళ్లకు రప్పించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని... దానిపై వారే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
'రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రాల విస్తీర్ణం,జనాభా సాంద్రతను బట్టి పరిస్థితులు వేరుగా ఉండొచ్చు.కేసులు ఎక్కడ ఎక్కువున్నాయో... అక్కడ అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.అంతిమంగా.. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయడం మంచిది. ప్రభుత్వ నిర్ణయంలో మేం జోక్యం చేసుకోలేం.' సుప్రీం కోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో టీచర్లందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోర్టు సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో స్కూళ్లు రీఓపెన్ అయ్యాయని... అయితే వాళ్లను ఫాలో అయ్యేందుకు ఇక్కడ అనుకూల పరిస్థితులు లేవని కోర్టు పేర్కొంది.ఇటీవలే దేశం కరోనా సెకండ్ వేవ్ను చవిచూసిందని... థర్డ్ వేవ్ కూడా రావొచ్చునని పేర్కొంది. అంతకుముందు,పిటిషనర్ తరుపు న్యాయవాది రవి ప్రకాష్ తన వాదనలు వినిపిస్తూ... ఇది పబ్లిసిటీ కోసం దాఖలు చేసిన పిటిషన్ కాదన్నారు. స్కూళ్లు తెరవకపోడం వల్ల మధ్యాహ్న భోజనంపై ఆధారపడిన చిన్నారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. కేరళలో నవంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్పై ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.పిల్లలు తప్పనిసరిగా స్కూళ్లకు రావాల్సిందేనని బలవంతపెట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం స్కూళ్లలో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది.ప్రైవేట్ స్కూళ్లు చాలావరకు ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తున్నాయి.